పెళ్లి కోసం పిల్ల తండ్రిని కిడ్నాప్‌ చేసి బెదిరించిన వైనం

29 May, 2019 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ : అమ్మాయి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఏకంగా ఆమె తండ్రిని కిడ్నాప్‌ చేసి.. బెదిరింపులకు గురి చేసి సదరు యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడో వ్యక్తి. వివరాలు.. ఢిల్లీకి చెందిన సంజీవ్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీలో సేల్స్‌ బాయ్‌గా ఉద్యోగం చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా బాధిత యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఓ సంవత్సరం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో ఆమె వారికి నచ్చజెప్పి వివాహానికి ఒప్పించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం కూడా జరిగింది.

ఇదిలా ఉండగా సంజీవ్‌కు గతంలోనే వేరే యువతితో నిశ్చితార్థం జరిగిందనే విషయం తెలిసింది.. దాంతో బాధిత యువతి సంజీవ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. అతనికి దూరంగా ఉండటం ప్రారంభించింది. ఇది తట్టుకోలేని సంజీవ్‌.. సదరు యువతిని బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో యువతి తండ్రిని కిడ్నాప్‌ చేసి ఓ హోటల్‌లో బంధించాడు. అనంతరం యువతి తండ్రి చేత ఆమెకు ఫోన్‌ చేయించి.. ‘సంజీవ్‌ చాలా మంచివాడు పెళ్లి చేసుకోమ’ని చెప్పించాడు. ముందు నుంచి సంజీవ్‌ మీద అనుమానం ఉన్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మోబైల్‌ నంబర్‌ను ట్రాక్‌ చేసి సంజీవ్‌ ఉంటున్న హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం సంజీవ్‌ను అరెస్ట్‌ చేసి.. యువతి తండ్రిని క్షేమంగా ఇంటికి చేర్చారు.

మరిన్ని వార్తలు