ఢిల్లీలో దారుణ సంఘటన

14 May, 2019 10:33 IST|Sakshi

న్యూఢిల్లీ : కూతురి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడో పోకిరి వెధవ. ఇదేంటని అడగటానికి వెళ్లిన తండ్రి మీద కత్తితో దాడి చేసి చంపేశారు. విషాదకరమైన ఈ సంఘటన న్యూఢిల్లీలోని మోతీ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఓ వ్యాపారవేత్త తన కూతురితో కలిసి ఆస్పత్రి నుంచి బైక్‌ మీద ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ యువకుడు వ్యాపారవేత్త కూతుర్ని ఉద్దేశిస్తూ.. అసభ్యకరం వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆ బిజినెస్‌మ్యాన్‌ ముందు కూతుర్ని ఇంటి దగ్గర వదిలి.. కామెంట్‌ చేసిన వ్యక్తి గురించి అతని తల్లిదండ్రులతో చెప్పడానికి వెళ్లాడు. జరిగిన విషయం కూతురు ఇంట్లో చెప్పడంతో.. బిజినెస్‌మ్యాన్‌ కుమారుడు కూడా నిందితుల ఇంటికి వెళ్లాడు.

బిజినెస్‌మ్యాన్‌ కొడుకు అక్కడికి చేరుకునేసరికి తన తండ్రి.. నిందితులకు మధ్య గొడవ జరుగుతుండటం గమనించాడు. తండ్రికి మద్దతుగా బిజినెస్‌మ్యాన్‌ కొడుకు కూడా నిందితులతో గొడవకు దిగాడు. మాటలతో ప్రారంభమైన ఈ వివాదం చివరకు దాడికి దారి తీసింది. దాంతో నిందుతుడు అతని తండ్రితో పాటు మరో ఇద్దరు సోదరులు కలిసి బిజినెస్‌మ్యాన్‌, అతని కొడుకు మీద కత్తితో దాడి చేశారు. నిందితుల ఇంటికి వెళ్లిన వారు ఇంకా రాకపోవడంతో అనుమానం వచ్చిన బిజినెస్‌మ్యాన్‌ భార్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ కత్తిపోట్లకు గురైన భర్త, కొడుకు ఆమెకు కనిపించారు. వెంటనే స్థానికుల సాయంతో వారిని ఆస్పత్రికి చేర్చారు.

అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిని బిజినెస్‌మ్యాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మరణించాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడు, అతని తండ్రిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనలో నిందితునికి సహకరించిన అతని సోదరులు చిన్నవారు కావడంతో వారిని జువైనల్‌ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు