న్యూఢిల్లీ : ఆడపిల్లపై ఉన్న ప్రేమ ఓ డ్రైవర్ను కిడ్నాపర్గా మార్చింది. కూతురు కావాలని అతను ఎంత కోరుకున్నా ఆ దేవుడు కరుణించలేదు. ఇద్దరు మగపిల్లలను సంతానంగా ఇచ్చాడు. అయినా కూతురే కావాలనే కోరికతో కిడ్నాపర్గా మారాడు. గత రెండు నెలల వ్యవధిలో ఇద్దరమ్మాయిలను కిడ్నాప్ చేసి కటకటాల పాలయ్యాడు. వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా తన సొంత బిడ్డాల్లానే చూసుకున్నాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. చిరాగ్ గోతిలో నివసించే కృష్ణ దత్ తివారీ (40) వృత్తిరీత్యా డ్రైవర్. అతనికి 12 ఏళ్ల, 14 ఏళ్ల ఇద్దరబ్బాయిలున్నారు.
గత శనివారం కృష్ణదత్ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. ఆ బాలికను తీసుకుబోతున్న దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యాయి. అయితే ఆ మరుసటి దినమే ఆ అమ్మాయి తన ఇంటికి రావడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో కృష్ణదత్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. తనే కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు రెండు నెలల క్రితం కూడా ఓ బాలికను కిడ్నాప్ చేశాడని, కూతురు కావాలనే కోరిక మేరకే అలా చేశాడని తమ విచారణలో తేలిందని, దర్యాప్తు సాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.