సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానిలో ఓ పోలీస్ అధికారి కుమారుడు రెచ్చిపోయాడు. స్నేహితురాలైన ఓ యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. తన మాట వినకుంటే ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ ప్రియురాలికి ఈ వీడియోను పంపాడు. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఏఎస్సైగా పనిచేస్తున్న అశోక్ కుమార్ తోమర్ కుమారుడు రోహిత్(21) ఈ నెల 2న యువతిని తన స్నేహితుడి ఆఫీసుకు రావాల్సిందిగా కోరాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సదరు యువతి బెదిరించింది. దీంతో బాధితురాలిని చావగొట్టిన రోహిత్.. ప్రియురాలికి ఈ వీడియోను పంపాడు. దీంతో ఈ ఘటనపై బాధితురాలితో పాటు రోహిత్ ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిపై స్పందించడంతో రేప్, బెదిరింపులు తదితర అభియోగాల కింద రోహిత్ను శుక్రవారం అరెస్ట్ చేశారు.