షాక్‌.. వెలుగులోకి మరో డేరా బాబా

22 Dec, 2017 10:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మరో ఫేక్‌ బాబా గుట్టు రట్టయ్యింది. దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్‌ దేవ్‌ దీక్షిత్‌ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి.  బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్‌ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్‌కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున్న సెక్స్ రాకెట్‌ నడుపుతున్నాడంటూ దీక్షిత్‌ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన అమ్మాయిలకు విముక్తి కలిపించారు. వీరేంద్రను తక్షణమే అరెస్ట్ చేయాలని డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌ డిమాండ్ చేస్తున్నారు. 

తనపై బాబా వీరేంద్ర  లైంగికదాడికి పాల్పడినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 100 మందికి పైగా మహిళలు ఆశ్రమంలో బందీలుగా ఉన్నారని.. వారిని జంతువుల్లా హింసిస్తున్నారని అడ్వొకేట్‌ నందిత రావ్‌ కోర్టుకు వివరించారు. పెద్ద ఎత్తున్న అమ్మాయిలతో ఆశ్రమంలోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆమె వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సీబీఐకి సోదాలు నిర్వహించాల్సిందిగా బుధవారం ఆదేశించింది. 

దశాబ్దం పైగానే...

ఆధ్యాత్మిక విశ్వవిద్యాయంలో కొందరు మహిళలను, బాలికలను 14 సంవత్సరాలుగా బందీలుగా ఉంచారని ఓ ఎన్జీవో హైకోర్టుకు జారీ చేసిన పిటిషన్లో పేర్కొంది. తాను ఆశ్రమం నుంచి తప్పించినట్లుగా పేర్కొన్న ఓ యువతిని ఈ సంస్థ కోర్టులో హాజరుపరిచింది. డ్రగ్స్‌ ఇచ్చి తనకు బ్రెయిన్‌ వాష్‌ చేసి ఆశ్రమంలో బంధీగా ఉంచినట్లు ఆ యువతి కోర్టుకు తెలిపింది. యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదని ఎన్జీవో తెలిపింది. ఆశ్రమంలో పలువురు మహిళలు గతంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కానీ పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఎన్జీవో ఆరోపించింది. న్యాయస్థానం ఆదేశం మేరకు ఢిల్లీ పోలీసులు, బుధవారం ఆశ్రమంపై దాడి నిర్వహించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్, న్యాయవాదుల బందం కూడా ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడున్న మహిళలను కలవడానికి తమకు రెండు గంటలు పట్టిందని స్వాతిమలివాల్‌ చెప్పారు.

150 మందికిపైగా బందీలు..

ఆశ్రమంలో సొరంగం కూడా ఉన్నట్లు పోలీసుల దాడిలో బయటపడింది. సొరంగాన్ని నీటిని నింపారని, అది కూడా ఆదరా బాదరాగా ఇటీవలే నింపారని పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో 150 మందికి పైగా మహిళలు, బాలికలను బందీలుగా ఉంచినట్లు దర్యాప్తు బందం కోర్టుకు తెలిపింది. వారిని ఇనుప సంకెళ్లతో బంధించి ఉంచారని, వారిని నిరంతరం హింసిస్తూ.. లైంగిక బానిసలుగా చూసేవారని దర్యాప్తు బందం తెలిపింది. స్నానం చేయడానికి, పడుకోవడానికి కూడా మహిళలకు ప్రైవసీ లేదని దర్యాప్తు బందం తెలిపింది. ఆశ్రమం నుంచి ఎవరూ పారిపోకుండా ఉండడం కోసం నాలుగు దిక్కులా ఎత్తయిన గోడలు నిర్మించి ముళ్లకంచెలు, లోహపు తలుపులు అమర్చారని వారు తెలిపారు. ఆశ్రమంలో దేహ వ్యాపారం జరుగుతోందని స్థానికులు దర్యాప్తు బందానికి తెలిపారు. రాత్రి పూట ఆశ్రమం గేటు ఎదుట లగ్జరీ కార్లు నిలబడి ఉంటాయని వారు చెప్పారు. దర్యాప్తు విషయం తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు తమను కూతుళ్లను కలవనిచ్చేవారు కాదని, వారిని బందీలుగా ఉంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. 

మరిన్ని వార్తలు