తెగిన వేలే పట్టించింది

20 Mar, 2019 10:35 IST|Sakshi

న్యూఢిల్లీ : కత్తితో బెదిరిస్తూ.. దొంగతనానికి ప్రయత్నిస్తుండగా నిందుతుడి వేలు తెగిపోయింది. చివరకు అదే వేలు.. ఆధారంగా మారి దొంగను పట్టించిన సంఘటన ఢిల్లీ జనక్పూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రంజిత్‌ కుమార్‌ అనే వ్యక్తి ఆదివారం మధ్యహ్నాం తన బంధువుతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఈ సమయంలో నిందితులు రాహుల్‌(24), ధరంబీర్‌(35) కూడా అదే బస్సు ఎక్కారు. రంజిత్‌ బస్సు దిగుతుండగా అతని పర్సు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించాడు. సరిగా అదే సమయంలో బస్సులో ఉన్న రాహుల్‌, రంజిత్‌ పర్సును బయటకు విసిరేశాడు.

అంతేకాక రాహుల్‌, అతని స్నేహితుడితో కలిసి రంజిత్‌ బంధువును కత్తితో బెదిరిస్తూ.. అతని వద్ద ఉన్న సొమ్ము లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ గొడవలో రాహుల్‌ వేలు తెగిపడింది. సొమ్ము తీసుకుని నిందితులిద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో రంజిత్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ తెగి పడిన వేలు దొరికింది. దాని ఆధారంగా ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకున్న పోలీసులు పాత నేరస్తుల డాటాతో పోల్చీ చూడగా రాహుల్‌ వేలిముద్రలతో సరిపోలింది. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్‌, అతని స్నేహితుడు ధరంబీర్‌ను అదుపులోకి తీసుకోవడమే కాక వారు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మీద ఇప్పటికే పలు కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు