పోకిరీ తాట తీసింది...!

27 Feb, 2018 14:04 IST|Sakshi
పోకిరీ తాటతీస్తున్న యువతి

సాక్షి, న్యూఢిల్లీ : రోడ్డు మీద వెళ్తుంటే ‘కుక్కల్లా మొరుగుతుంటారు‌’.. మనమెందుకులే అని మిగతా యువతుల్లా భరించాలని ఆమె అనుకోలేదు. కొద్దిసేపు భరించింది. వెంటాడుతూ అనుచిత వ్యాఖ్యలకు దిగారు. అంతే... తట్టుకోలేకపోయింది. ఉగ్రరూపం దాల్చి  ఆ పోకిరీని గల్లా పట్టి కొట్టుకుంటూ స్టేషన్‌కు ఈడ్చుకొచ్చింది. దేశరాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 25న కరోల్‌ బాగ్‌లోని గఫర్‌ మార్కెట్‌కు తన స్నేహితురాలితో ఆ యువతి వెళ్లింది. ఇంతలో ఐదుగురు వ్యక్తులు వారిని వేధించటం మొదలుపెట్టారు.  దీంతో యువతులిద్దరూ రిక్షా ఎక్కి అక్కడి నుంచి బయలుదేరారు. వారిలో ఇద్దరు బైక్‌పై వాళ్ల రిక్షాను వెంబడిస్తూ కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. అందులో ఒక్క వ్యక్తి మాత్రం సదరు యువతిపై అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి రిక్షా దిగి మరీ అతన్ని ఈడ్చి కొట్టింది.

అంతటితో ఆగకుండా వాడి గల్లా పట్టి కొట్టుకుంటూ దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కు లాక్కెళ్లింది. ఈ క్రమంలో అక్కడ గుమిగూడిన స్థానికులు కొందరు ఆమెకు సాయం చేయటం విశేషం. యువతి ఫిర్యాదు మేరకు మనీష్‌, అభిషేక్‌ అనే యువకులను అరెస్ట్‌ చేశారు.  

ఇదిలా ఉంటే ఢిల్లీలో గత రెండేళ్లలో లైంగిక దాడుల కేసులు అధికమైపోయాయి. సగటున రోజుకు అయిదుకు పైగా అత్యాచార కేసులు నమోదు అవుతున్నట్లు ఢిల్లీ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది సుమారు 3,273 కేసులు నమోదు కాగా, అందులో 650 ఈవ్‌టీజింగ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు