డెలివరీ బాయ్స్‌ కళ్లల్లో కారం చల్లి చోరీలు

4 Feb, 2018 07:10 IST|Sakshi
నిందితుల వివరాలను వెళ్లడిస్తున్న ఏసీపీ విజయ్‌కుమార్‌

అమీర్‌పేట్‌:  ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌లు బుక్‌చేసుకుంటారు. వాటిని తీసుకుని వచ్చే డెలివరీ బాయ్స్‌కు నకిలీ డెబిట్‌ కార్డులు ఇచ్చి కళ్లల్లో కారం చల్లి వస్తువులను లాక్కొని పరారవుతారు. పసిగట్టిన పోలీసులు అరెస్టుచేసి  రూ.1.5 లక్షలు విలువచేసే సొత్తును  స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌  వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూర్‌కు చెందిన సంగన కిషోర్‌ నగరంలోని గుడిమ ల్కపూర్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.రాజమండ్రి  సీతమ్మపేట నివాసి మల్లిరెడ్డి శివశంకర్‌ డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం కోసం వచ్చి చింతల్‌లో ఉంటున్నాడు. వీరికి పరిచయం ఏర్పడి జులాయిగా తిరుగుతున్నారు.అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దుర్భుద్ది కలిగింది. ఆన్‌లైన్‌లో  ఫ్లిప్‌కార్ట్,అమేజాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఖరీదైన ఫోన్‌లను బుక్‌ చేసుకుంటారు.

ఆ సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్‌ వాటిని తీసుకుని వారికి ఫోన్‌ చేయగా జనసంచారం లేని  ప్రాంతాలకు పిలిపించుకుంటారు. నకిలీ డెబిట్,క్రెడిట్‌  కార్డులను బాయ్‌కి ఇచ్చి వాటిని స్వైప్‌ చేస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి పార్సిళ్లను ఎత్తుకు వెళుతారని  ఏసీపీ వివరించారు. ఎస్‌ఆర్‌నగర్, శంషాబాద్, జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌  పరిధిలో దోపిడీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని క్రైం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 5 స్మార్ట్‌ సెల్‌ఫోన్‌లు, ఒక ట్యాప్‌ టాప్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. దొంగలను   పట్టు కోవడంలో కీలకంగా వ్యవహరించిన డిటెక్టివ్‌ కిషోర్‌ పాటు డీఎస్సై జి.శ్రీనివాస్‌ ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇన్స్‌పెక్టర్లు వహిదుద్దీన్, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు