మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

7 Sep, 2019 11:29 IST|Sakshi

ఊరేగింపులో ఎస్‌ఐ హల్‌చల్‌

యువకుల ఆందోళనతో వెనక్కి తగ్గిన పోలీసు అధికారి

సాక్షి, ధారూరు: మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వినాయకుల ఊరేగింపులో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్‌ చేసి హల్‌చల్‌ చేశారు. దీంతో యువత, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఎస్‌ఐ ఎవరికీ చెప్పకుండా మైకులకు ఉన్న వైర్లను కట్‌చేసి సౌండ్‌ సిస్టంను బంద్‌ చేయించారు. దీంతో యువకులతోపాటు భక్తులు ఆందోళనకు దిగారు. మైకులకు అనుమతి ఇవ్వకుంటే వినాయక విగ్రహాలను కదలనివ్వమని, పోలీస్‌స్టేషన్‌లో విగ్రహాలను పెడతామని, పోలీసులే నిమజ్జనం చేసుకోవాలని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఎస్‌ఐ పట్టించుకోకుండా ఊరుకున్నారు. దీంతో యువకులు పోలీసుల వాహనం ఎదుట బైఠాయించారు. ‘జై బోలో.. గణేశ్‌ మహరాజ్‌ కీ జై’ అంటూ నినదించారు. చివరకు ఎస్‌ఐ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సర్పంచ్‌ చంద్రమౌలి, గ్రామస్తులు చర్చలు జరిపారు. ధారూరు సీఐ రాజశేఖర్‌ జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఎస్‌ఐ మిన్నుకండిపోయారు. అనంతరం యువకులు శాంతించి నిమజ్జనం పూర్తి చేయడంతో సమస్య సద్దుమణిగంది.  

మరిన్ని వార్తలు