ప్రాణాలు కాపాడిన ‘డయల్‌ 100’ 

11 Dec, 2019 09:04 IST|Sakshi

రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని..

రక్షించిన ఖమ్మం బ్లూకోల్ట్స్‌ పోలీస్‌ పాషా

సాక్షి, ఖమ్మం : డయల్‌–100కు వచ్చిన ఫోన్‌ కాల్‌కు స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను త్రీటౌన్‌ బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ పాషా కాపాడి..శెభాష్‌ అనిపించుకున్నారు. మంగళవారం త్రీటౌన్‌ పరిధిలోని బొక్కల గడ్డ ప్రాంతానికి చెందిన కొత్తపల్లి మల్లయ్య తన భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయాడు. తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యచేసుకోబుతున్నానని భార్యకు ఫోన్‌ చేసి..వెంటనే కట్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన ఆమె.. డయల్‌–100కు ఫోన్‌ చేసి ఈ విషయాలన్నీ వివరించింది. త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌ సత్వరమే స్పందించి.. ఆ వ్యక్తి ఉన్న లోకేషన్‌ ఆధారంగా సారధినగర్‌ రైల్వేట్రాక్‌ సమీపంలో ఉన్నట్లు గుర్తించి..బ్లూకోల్ట్స్‌ బృందాన్ని అప్రమత్తం చేశారు.

కానిస్టేబుల్‌ పాషా లొకేషన్‌ మ్యాప్‌ ద్వారా కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే..మల్లయ్య రైల్వేట్రాక్‌పై పడుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అడ్డుకున్నారు. ఆ సమయంలో రైలు రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా..మల్లయ్య ఆత్మహత్య చేసుకునేవాడని..పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మల్లయ్య కుటుంబసభ్యులు త్రీటౌన్‌ సీఐ శ్రీధర్, బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ పాషాకు కృతజ్ఞతలు తెలిపారు. డయల్‌ 100 కాల్‌కు స్పందించి మనిషి ప్రాణాలు కాపడిన త్రీటౌన్‌ సీఐ, బ్లూకోల్ట్స్‌ టీమ్‌ను సీపీ  తఫ్సీర్‌ ఇక్బాల్, అడిషనల్‌ డీసీపీ మురళీధర్, ఏసీపీ గణేష్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు