వేధించాలనుకున్నాడు... కానీ అంతలోనే

19 Dec, 2018 15:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై : తనను వేధింపులకు గురిచేసిన ఆకతాయికి సరైన బుద్ధి చెప్పిందో బాలిక. దివ్యాంగురాలు అయినంత మాత్రాన తనను తేలికగా తీసుకోవద్దని అతడి వేళ్లు పాక్షికంగా విరిచేసి పోలీసులకు పట్టించింది. అసలేం జరిగిందంటే... ముంబైకి చెందిన ఓ పదిహేనేళ్ల బాలిక తన తండ్రితో కలిసి లోకల్‌ ట్రెయిన్‌లో ప్రయాణిస్తుంది. దివ్యాంగురాలు(అంధురాలు) కావడంతో తమ కోసం ప్రత్యేకంగా కేటాయించడిన కంపార్ట్‌మెంట్‌లో ఎక్కింది. ఆ సమయంలో ఆమెకు తోడుగా తండ్రి కూడా ఉన్నాడు.

ఈ క్రమంలో విశాల్‌ బలరామ్‌ సింగ్‌ అనే యువకుడు వీరు ఉన్న కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు. రాత్రి పూట కాబట్టి రద్దీ ఎక్కువగా లేకపోవడంతో బాలికను వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టడంతో ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. అయితే ఆమె తండ్రి హెచ్చరించినప్పటికీ కూడా అతడు పట్టించుకోకుండా అలాగే ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన బాలిక స్కూళ్లో నేర్చుకున్న సెల్ఫ్‌ డిఫెన్సింగ్‌ స్కిల్క్స్‌ను అతడిపై ప్రయోగించింది. యువకుడి చేయి గట్టిగా మెలితిప్పి వేళ్లను పాక్షికంగా విరిచేసింది. ఈ చర్యతో కంగుతిన్న ఆ యువకుడు నిశ్చేష్టుడైపోయాడు. ఈలోపు ఆమె తండ్రి రైల్వే పోలీసులకు ఫోన్‌ చేయడంతో దాదర్‌ రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మమ్మల్ని తేలికగా తీసుకుంటారు..
‘దివ్యాంగులు అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. వీళ్లను ఏం చేసినా పడి ఉంటారులే అనుకుంటారు. కానీ మా స్కూళ్లో కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించారు. ఆత్మరక్షణ కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదని మా టీచర్లు ఆత్మవిశ్వాసం నింపారు. అదే ఈరోజు పనికివచ్చింది. అతడు ఇంకోసారి ఎవరితో అసభ్యంగా ప్రవర్తించకూడదనే అలా చేశాను’ అంటూ బాలిక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు