మహబూబ్నగర్ : దిశ కేసులో నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం మక్తల్ మండలం జక్లేర్ నుంచి స్వగ్రామం గుడిగండ్లకు వెళ్తున్న కురమయ్యను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో చెన్నకేశవులు కుటుంబంలో విషాదం నెలకొంది.
హైదరాబాద్ నగర శివార్లలో దిశపై అత్యాచారం, హత్య చేసిన కేసులో జక్లేర్ గ్రామానికి చెందిన ఆరిఫ్ ఏ1 నిందితుడు కాగా, మిగిలిన ముగ్గురు నిందితులు జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామానికి చెందినవారు. దిశ ఘటన తరువాత నిందితులు ఎన్కౌంటర్లో మృతిచెందగా.. ఇటీవలే వారి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.