దిశ కేసు : ముగిసిన తొలిరోజు కస్టడీ

5 Dec, 2019 20:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ అత్యాచారం, హత్య ఘటన నిందితుల తొలిరోజు కస్టడీ ముగిసింది. వారం రోజులపాటు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్‌ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక ఆధారాలు సేకరించింది. నిందితుల లారీలో తనిఖీలు చేపట్టిన క్లూస్‌ టీమ్‌.. దిశ బ్లడ్‌ శాంపిల్స్‌, తల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. లారీ క్యాబిన్‌లో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. తుండుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో దిశ ఫోన్‌ను పాతిపెట్టినట్లు గుర్తించారు. ఆ మొబైల్‌ ఫోన్‌ను క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. మరోవైపు.. మహబూబ్‌నగర్ ఫాస్ట్ ట్రాక్‌ కోర్టును ఉన్నతాధికారులు పరిశీలించారు. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ వేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది.

ఇదిలా ఉంటే.. దిశ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు విచారణను వేగవంతం చేశారు. దిశ హత్య కేసులో మొత్తం ఏడు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉంటారని చెప్పారు. సీపీ నుంచి కానిస్టేబుళ్ల వరకు ఇన్వెస్టిగేషన్ చార్జ్‌షీట్ దాఖలు వరకు ఈ ఏడు బృందాలు పని చేయనున్నాయి.

మరిన్ని వార్తలు