దివ్య హత్య కేసు: సంచలన నిజాలు

7 Jun, 2020 11:17 IST|Sakshi
దివ్య (ఫైల్‌)

సాక్షి, విశాఖపట్నం : దివ్య హత్య కేసులో విశాఖ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. దివ్య హత్యకేసులో నలుగురికిపైగా వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితురాలు వసంత, ఆమె సోదరి మంజులని అదుపులోకి తీసుకుని‌ విచారిస్తున్నారు. నిందితులు దివ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అత్యంత పాశవికంగా దివ్య హత్య
నిందితులు దివ్య కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత పాశవికంగా పెద్ద అట్ల‌కాడతో ఒళ్లంతా వాతలు పెట్టారు. ఆమెకు గుండు కొట్టించి, కనుబొమ్మలను సైతం తొలగించారు. అయిదారు రోజులపాటు భోజనం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలు చేసి అయిదారు రోజులపాటు ఆహారం పెట్టకపోవడంతో దివ్య మరణించింది. మృతురాలి శరీరంపై 33 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హత్య చేసిన రోజే మృతదేహాన్ని తరలించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. రాత్రి సమయంలో అంతిమయాత్ర వాహన యాజమాని నాయుడుని‌ సంప్రదించారు. ( అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య )

ఎంత డబ్బు అయినా ఇస్తామని, శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించాలని వాహన యాజమానిపై వారు ఒత్తిడి తెచ్చారు. దివ్య శరీరంపై గాయాలను గుర్తించిన నాయుడు పోలీసులకి తెలియజేశాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరికొందరు‌ నిందితుల‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ 
దివ్యను తన ఇంట్లోనే ఉంచి వసంత అనైతిక కార్యకలాపాలకి ఉపయోగించి డబ్బు సంపాదించేది. ఇటీవల‌ కాలంలో ఇద్దరి మధ్యా ఆర్ధిక విషయాలకు సంబంధించి విభేదాలు తలెత్తాయి. దీంతో వసంత నుంచి‌ బయటకి వెళ్లిపోవాలని‌ ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో దివ్యపై కక్ష పెంచుకున్న నిందితులు క్రూరంగా హత్యచేశారు.

మరిన్ని వార్తలు