సహాయం చేద్దామని వెళితే.. ప్రాణాలనే కోల్పోయాడు

16 Sep, 2019 19:42 IST|Sakshi
ప్రమాదంలో మరణించిన వైద్యుడు ఖుర్జేకర్‌

ముంబై : ఎదుటి వాళ్లు ఆపదలో ఉంటే సహాయం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. సొంత వాళ్లు ప్రమాదంలో ఉన్నా పట్టించుకోని రోజులు ఇవి. అయితే ముంబైలో జరిగిన ఓ సంఘటన మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. తోటి వ్యక్తికి సహాయం చేద్దామని ప్రయత్నించిన ప్రముఖ వైద్యుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు అతన్ని కబళించేసింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం పూణెకు చెందిన వెన్నెముక నిపుణుడు డాక్టర్ కేతన్ ఖుర్జేకర్, మరో ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులతో కలిసి ముంబై నుంచి పూణేకు క్యాబ్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు సోమటనే గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో టైరు పాడైంది. దీంతో టైరు మార్చడానికి డ్రైవర్‌ కిందకు దిగాడు. అయితే మిగిలిన డాక్టర్లు కిందికి దిగి రిలాక్స్‌ అవుతుండగా, డాక్టర్‌ ఖుర్జేకర్‌ మాత్రం డ్రైవర్‌కు సాయం చేస్తున్నారు. ఇంతులో  అకస్మాత్తుగా  ఓ ప్రైవేట్‌ బస్సు వెనకనుంచి వీరిని ఢీ కొట్టింది.  ఈ దుర్ఘటనలో వైద్యుడు ఖుర్జేకర్‌, క్యాబ్‌ డ్రైవర్‌ జ్ఞానేశ్వర్ భోంస్లే (27)అక్కడికక్కడే  ప్రాణాలు విడిచారు.  గాయపడిన మిగతా ఇద్దరు వైద్యులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలోఅసువులు బాసిన డాక్టర్‌ ఖుర్జేకర్‌ వృత్తిలో గోల్డ్‌ మెడలిస్ట్‌ కావడం విశేషం. అంతేగాక ఓ ఆసుపత్రిలో వెన్నెముక శస్త్రచికిత్స విభాగానికి అధిపతి. ఆయన సుమారు 3,500 క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం పేరుగాంచారు.

మరిన్ని వార్తలు