కుక్కను కొట్టి.. మృతదేహంతో పరారీ

21 May, 2020 15:08 IST|Sakshi

భోపాల్‌: తనను కరిచిందనే కోపంతో మూగజీవం పట్ల అమానుషంగా ప్రవర్తించాడో వ్యక్తి. దానిని తీవ్రంగా హింసించి ఉరితీసి చంపేశాడు. అనంతరం దాని మృతదేహంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తిని చూసి అరుస్తూ అతడిని కరిచింది. దీంతో అతడు కుక్క యజమానితో ఘర్షణకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. తమ కుక్కకు వ్యాక్సిన్‌ చేయించామని.. అది కరిచినా ఎటువంటి హాని కలగదని చెప్పి... అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు.

ఈ నేపథ్యంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి యజమానిని అనుసరించిన నిందితుడు.. బలవంతంగా ఇంట్లోకి వెళ్లి కుక్కను ఎత్తుకొచ్చాడు. అనంతరం ముగ్గురు కలిసి దానిని తీవ్రంగా కొట్టి చంపారు. దాని మెడలో ఉన్న గొలుసుతో ఉరి తీసి.. మెట్లపై నుంచి కిందకు వేలాడదీశారు. దీంతో ఆ కుక్క ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గురించి కుక్క యజమాని మాట్లాడుతూ.. అన్యాయంగా మూగజీవిని బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వద్దని ఎంత మొత్తుకున్నా తనను నెట్టేసి అమానుష చర్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముగ్గురు పరారీలో ఉన్నారని.. కుక్క మృతదేహం కోసం వెదుకుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు