బ్యాంక్‌ అధికారిపై గృహ హింస కేసు

4 Feb, 2019 13:45 IST|Sakshi

ఇప్పటికే వరకట్నం కేసులో అరెస్టు, చార్జిషీటు దాఖలు

గుంటూరు, తెనాలి: స్థానిక ఐడీబీఏ శాఖలో అసిస్టెంటు మేనేజరుగా పనిచేస్తున్న కరేటి శ్రీనివాస్, అతడి తలిదండ్రులు, సోదరిపై హైదరాబాద్‌లో గృహహింస కేసు (డీవీసీ నెం.56/2019) నమోదైంది. రాజేంద్రనగర్‌లోని 14వ మేజిస్ట్రేటు కోర్టులో శ్రీనివాస్, తల్లిదండ్రులు కరేటి ఉషారాణి, రామనాథ్, సోదరి అనితపై ఈనెల ఒకటో తేదీన కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఆదివారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పాండురంగపేటకు చెందిన కరేటి శ్రీనివాస్‌కు, హైదరాబాద్‌లోని శివమౌనిక యాదవ్‌కు 2012 డిసెంబరులో వివాహమైంది. తెనాలిలోనే జరిగిన ఈ పెళ్లికి ముందుగానే కట్నం కింద నగదు, చెక్కులు, ఇతర ఆస్తుల్ని తీసుకున్నారు.

మరో ఆర్నె  ల్లకు భార్య దగ్గర మరో రూ.8 లక్షల్ని శ్రీనివాస్‌ తీసుకున్నాడు. ఇంత కట్నం తీసుకున్నా, ఇంకా డబ్బులు తెమ్మంటూ వేధింపులు ఆరంభించారు. శ్రీనివాస్‌ తల్లిదండ్రులు ఉషారాణి, కరేటి రామనా«థ్, సోదరి అనిత కూడా ఇందుకు సహకరించినట్టుగా బాధిత శివమౌనిక యాదవ్‌ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషనులో 2017లో ఫిర్యాదు చేశారు. దీనిపై అక్కడి పోలీసులు 498–ఎ ఐపీసీ 3,4 డీపీఏ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేశారు. గతేడాది పోలీసులు ఈ కేసులో చార్జిషీటును సమర్పించారు. శ్రీనివాస్, అతడి తండ్రి అధిక రేటుతో వడ్డీ వ్యాపారం చేస్తుంటారని, బాకీదారైన ఒక స్కూలు టీచరును ఇదే విషయమై దూషించగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చార్జిషీటులో పొందుపరిచారు. వరకట్న వేధింపుల కేసు విచారణ దశలో ఉండగా, తాజాగా హైదరాబాద్‌ కోర్టులో గృహహింస కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు