పెళైన రెండు నెలలకే!

2 Sep, 2018 13:49 IST|Sakshi
నిరోజ(ఫైల్‌)

పెగడపల్లి(ధర్మపురి):  పెళ్లయిన రెండు నెలలకే ఓ యువతి తనువు చాలించింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికనపల్లిలో శనివారం జరిగింది. ఇన్‌చార్జి ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి నాగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి–లక్ష్మి దంపతుల కుమారుడు సురేందర్‌రెడ్డికి వెల్గటూర్‌ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన లోక మల్లారెడ్డి–గంగవ్వ కూతరు నిరోజ(20)తో 2018, జూన్‌ 7న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.లక్ష నగదు, మూడు తులాల బంగారం, 30 గుంటల భూమి కట్నం కింద ఇచ్చారు.

పెళ్లయిన కొద్దిరోజులకే అత్తింట్లో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో నిరోజ వేధింపులు భరించలేక శనివారం ఉదయం అత్తవారింట్లోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త సురేందర్‌రెడ్డి, అత్త లక్ష్మి, మామ శ్రీనివాస్‌రెడ్డి, మరిది నరేందర్‌రెడ్డి తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిరోజ తల్లిదండ్రులు మల్లారెడ్డి, గంగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిరోజది హత్యా, ఆత్మహత్యా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు