-
అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
భర్తతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు
కర్నూలు, వెల్దుర్తి: భర్త, అత్తా, మామలు, బావల (భర్త అన్నలు) వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆదివారం మండలంలోని కలుగొట్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరసింహులు తెలిపిన మేరకు వివరాలు.. కర్నూలు మండలం నందనపల్లె గ్రామానికి చెందిన అనురాధ (22)కు మూడేళ్ల క్రితం కలుగొట్లకు చెందిన రామాంజితో వివాహమైంది. వీరికి ఏడు నెలల పాప కూడా ఉంది. అయితే వివాహమైన నాటి నుంచి భర్తతో పాటు అత్త సుబ్బమ్మ, మామ నాగేశ్వరరావు, ఇద్దరు బావలు వేధించేవారు.
ఆమెపై అనుమానంతో తరచూ గొడవ పడేవారు. పలుమార్లు పెద్దల వద్ద పంచాయితీలు, పోలీస్స్టేషన్కు కూడా వెళ్లారు. ఈ క్రమంలో శనివారం వేధింపులు అధికమవడంతో అనురాధ.. తల్లితండ్రులకు సమాచారం తెలిపింది. వారు ఆదివారం కలుగొట్లకు వచ్చి అత్మింటివారితో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తనను ఎవరూ రక్షించలేరని తలచి గదిలోకి వెళ్లి శ్లాబ్కు ఉన్న ఇనుప కొక్కెనికి తాడుతో ఉరేసుకుంది. ఆలస్యంగా గమనించిన తల్లితండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తల్లి కుమారి ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, బావలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.