‘‘మేము ఎవరిమో నీకు తెలుసా..?’’

11 Nov, 2018 08:00 IST|Sakshi
ఎస్సైపై, సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన నిందితులు వీరే...

సాక్షి, కొత్తగూడెంఅర్బన్‌: పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై, పోలీసులపై నలుగురు తాగుబోతులు దౌర్జన్యం చేశారు. ‘మేము ఎవరిమో తెలుసా..? తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాం’ అని, ఎస్సైని బెదిరించారు. కొత్తగూడెం త్రీటౌన్‌ సీఐ ఆదినారాయణ, ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు... అది, కొత్తగూడెంలోని సూపర్‌బజార్‌ సెంటర్‌. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలు దాటింది. కొత్తగూడెం 33వ వార్డు కౌన్సిలర్‌ కుమారుడు బాలిశెట్టి పృథ్వీరాజ్‌తోపాటు బి.కృష్ణార్జున్, ఎండి.రఫిక్, బాలిశెట్టి సత్యనారా యణ.. మద్యం మత్తులో ఉన్నారు. తమ కారును సెంటర్‌లో ఆపారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ.. అదే సమయంలో అటువైపుగా ఎస్సై నరేష్, పోలీసులు వచ్చారు.

అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారితో ఎస్సై చెప్పారు. అంతే.. ఆ నలుగురు ఎదురుతిరిగారు. ‘‘మేము ఎవరిమో తెలుసా..?’’ అంటూ, ఎస్సైపై.. సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ‘‘తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాం’’ అంటూ, మీది మీదికొచ్చి నెట్టేశారు. దుర్భాషలాడారు. ఆ నలుగురు తాగుబోతులను జీపులోకి ఎస్సై ఎక్కించారు. అప్పుడు కూడా ఆ తాగుబోతులు ఎదురు తిరిగారు. వారిని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిపై సీఐ ఆదినారాయణకు ఎస్సై నరేష్‌ ఫిర్యాదు చేశారు. సీఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. ఆ నలుగురిని శనివారం కోర్టుకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు