పొమ్మన్నందుకు పోలీసును చావబాదారు..!!

28 May, 2018 15:17 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌/ముజఫర్‌నగర్‌ : రాష్ట్రంలో అల్లరి మూకల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. పోలీసు ఔట్‌పోస్టు వద్ద మద్యం సేవిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. దుడ్డు కర్రలతో ఆయన్ని చావ బాదారు. ఈ ఘటన ముజఫర్‌ నగర్‌ జిల్లాలోని ఉఖావలి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ హరిరామ్‌ యాదవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉఖావలి పోలీసు ఔట్‌పోస్టు వద్ద దీపక్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం ఔట్‌పోస్టు సమీపంలో మద్యం సేవిస్తున్న కొందరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని దీపక్‌ హెచ్చరించారు. మద్యం మత్తులో ఉన్న ఆ గుంపులోని వారంతా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. దీపక్‌ ఒంటరిగా ఉండడంతో అతనిపై దుడ్డు కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ప్రమేయమున్న 21 మందిపై కేసు నమోదు చేశామనీ యాదవ్‌ తెలిపారు. అనిల్‌కుమార్‌, మోనూ, ముఖేష్‌, మనోజ్‌కుమార్‌లను అనే నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలింపు చేపట్టామని యాదవ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు