మద్యం మత్తులో డ్రైవర్‌..పోలీస్‌ బస్సు బోల్తా

13 Mar, 2018 06:59 IST|Sakshi
లక్ష్మీనగర్‌ సమీపంలో బోల్తా పడిన మినీబస్సు

ఐదుగురు సిబ్బందికి గాయాలు 

తల్లాడ: మండల పరిదిలోని లక్ష్మీనగర్‌ సమీపంలో సోమవారం పోలీస్‌ మినీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఐదుగురు పోలీస్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్న మినీబస్సు అతి వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీ కొట్టి, బోల్తా పడింది. ఎదురుగా లోయలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీస్‌ ఏఓ సీహెచ్‌.వెంకటేశ్వర్లు, హెడ్‌ కానిస్టేబుల్‌ సువర్ణబాబు, జూనియర్‌ అసిస్టెంట్లు పి.రాములు, ఎస్‌కె.అబ్బాస్, ఎండీ.ఫయాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు.

సంఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐ మల్లయ్య స్వామి సందర్శించారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. క్రేన్‌ సహాయంతో మినీ బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తీశారు. డ్రైవర్‌ ఎం.జ్ఞాన సుందర్‌ రావు మద్యం మత్తులో ఉన్నాడని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో తేలినట్లు ఎస్సై మేడా ప్రసాద్‌ తెలిపారు.  ఈ మేరకు తల్లాడ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

                              సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వైరా ఏసీపీ ప్రసన్నకుమార్‌    

మరిన్ని వార్తలు