‘బంగారం సొమ్ము’ కొల్లగొట్టిన బందిపోటు ముఠా అరెస్ట్
మహారాష్ట్రకు చెందిన ముఠాతో కలిసి నేరం
బొమ్మ పిస్టల్ చూపించి రూ.3.67 కోట్లు దోపిడీ
ఏడుగురు నిందితుల అరెస్టు
రూ.2.89 కోట్ల నగదు, బంగారం స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ సమీపంలోని రాయకల్ టోల్ప్లాజా సమీపంలో గత నెలలో చోటు చేసుకున్న భారీ బందిపోటు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. బంగారం విక్రయించగా వచ్చిన సొమ్మును కేరళ తరలిస్తుండగా యజమాని మాజీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో బందిపోట్లు కారు డ్రైవర్ను బొమ్మ పిస్టల్తో బెదిరించి రూ.3,67,17,850 పట్టుకుపోయారు. ఈ కేసును దర్యాప్తు చేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు మరో నేరం చేసేందుకు వచ్చిన ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2,89,33,800 నగదు, 350 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాజు నాంగ్రే మైసూర్లో స్థిరపడ్డాడు. అతను కేరళలో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి హైదరాబాద్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని బంగారం వ్యాపారులకు విక్రయించేవాడు. ఈ దందా మొత్తం పన్ను లేకుండా సాగుతుండటంతో లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగేవి. బంగారం వ్యాపారులకు పసిడి డెలివరీ చేసేందుకు, వారి నుంచి డబ్బులు వసూలు చేసుకుని వచ్చేందుకు ఏడు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు.
ముఠా సభ్యులకు లోకేషన్ షేరింగ్
జూన్ మొదటి వారంలో దష్మేష్ దాబా వద్దకు వచ్చిన మయూరేష్ లోకేషన్ను విశ్వజీత్, సుజాతలకు షేర్ చేయడంతో పాటు వాహనాల కదలికలపై సమాచారం అందించాడు. ఆ తర్వాత తన స్నేహితుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడంటూ యజమానికి చెప్పిన మయూరేష్ సెలవుపై వెళ్లిపోయాడు.
వాహనాలకు ప్రత్యేక లాకర్
వాహనం ముందు భాగంలో ఉండే రెండు సీట్ల కింద ఓ రహస్య లాకర్ ఏర్పాటు చేయించాడు. బంగారం, నగదు ఇందులో పెట్టి ప్రత్యేక ఉపకరణం ద్వారా లాక్ చేస్తే లాకర్ ఉన్న విషయం బయటి వ్యక్తులకు తెలియదు. ఈ ఏడు వాహనాలకు షిఫ్ట్ల వారీగా పని చేసేందుకు 30 మంది డ్రైవర్లను నియమించుకున్నాడు. రాజు నాంగ్రే సూచనల మేరకు వీరు బంగారం డెలివరీ , నగదు వసూలు చేసుకు వచ్చేవారు. ఎప్పుడైనా పోలీసులు ఆపి తనిఖీ చేసినా రహస్య లాకర్ వారి కంట పడేది కాదు. సదరు డ్రైవర్లలో ఎవరు హైదరాబాద్కు వచ్చినా రాయ్కల్ టోల్ ప్లాజా సమీపంలోని దష్మేష్ దాబా వద్ద ఆగి భోజనాలు చేయడం పరిపాటి. మహారాష్ట్రలోని ఖోపట్ ప్రాంతానికి చెందిన మయూరేష్ మనోహర్ పిసల్ థానేలో స్థిరపడి నాలుగు నెలల క్రితం రాజు నాంగ్రే వద్ద డ్రైవర్గా చేరాడు. విధి నిర్వహణలో భాగంగా ‘ప్రత్యేక కార్లలో’ వెళ్లి వస్తూ బంగారం డెలివరీ, నగదు వసూలు చేసేవాడు. అంతకు ముందు థానేలో ఆటో నడుపుకునే అతను చేపల వ్యాపారం చేసే సుజాత రమేష్ ఘోరే అనే మహిళకు సహాయం చేసేవాడు. కొద్ది రోజుల క్రితం థానేకు వెళ్లిన మయూరేష్ ఈ విషయం సుజాతకు చెప్పడంతో ఆమె తన కుమారుడు భోస్లే విశ్వజిత్ చంద్రకాంత్కు చేరవేసింది. దీంతో ఈ ముగ్గురు కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసి ‘ప్రత్యేక వాహనం’లో రవాణా అయ్యే నగదు దోచుకునేందుకు పథకం పన్నారు. అయితే తాను స్వయంగా నేరంలో పాల్గొంటే ఎవరైనా గుర్తించే ఆస్కారం ఉందని భావించిన మయూరేష్ తాను దూరంగా ఉంటానని చెప్పాడు. దీంతో సుజాత తన సోదరి సునీతతో పాటు ఆకాష్ కాంబ్లీ, సున్నీ చవాన్, ఆకాష్ దీపక్ రాథోడ్తె కలిసి ముఠా ఏర్పాటు చేసింది. హైదరాబాద్ వచ్చిన ప్రతి వాహనం దష్మేష్ దాబా వద్ద ఆగుతుందన్న సమాచారం ఉండటంతో దాబా సమీపంలోనే చోరీ చేయాలని చేయాలని భావించిన ముఠా సభ్యులంతా థానే రైల్వే స్టేషన్లో రూ.1000తో పిస్టల్ మాదిరిగా ఉండే సిగరెట్ లైటర్ను కొనుగోలు చేశారు.
రెండు రోజులు రెక్కీ
గత నెల 26న ప్రైవేట్ వాహనాల్లో దాబా వద్దకు చేరుకున్న విశ్వజిత్, ఆకాష్ కాంబ్లీ, సున్నీ చవాన్, ఆకాష్ దీపక్ సమీపంలోని ఓ లాడ్జిలో బస చేశారు. రెండు రోజుల అనంతరం 28న ‘తమకు అవసరమైన’ వాహనం వస్తోందంటూ మయూరేష్ నుంచి వారికి సమాచారం అందింది. ఆ రోజు వాహనానికి రాహుల్ అనే వ్యక్తి డ్రైవర్గా వ్యవహరించాడు. దీనిని గుర్తించిన ముఠా దాబా నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో అనువైన చోట వాహనాన్ని ఆపి బొమ్మ తుపాకీ చూపించి రాహుల్ను బెదిరించిన వీరు నలుగురూ అదే వాహనంలో ఎక్కారు. బూర్గుల చౌరస్తా వద్ద రాహుల్ను దింపేసి, యూ టర్న్ చేసుకుని వాహనంతో సహా హైదరాబాద్ వైపు వచ్చేశారు. మార్గమధ్యలో ముంబై హైవే ఎక్కిన వీరు నేరుగా మహారాష్ట్రలోని కరాడ్ ప్రాంతంలోని విశ్వజీత్ ఇంటికి చేరుకున్నారు. అక్కడే ఏడుగురు ముఠా సభ్యులు రూ.3.67 కోట్ల నగదు పంచుకున్నారు. ఈ సొమ్ములో కొంత వెచ్చించి విశ్వజీత్ బైక్, మయూరేష్ ఎస్యూవీ వాహనం, సుజాత, సునీత 350 గ్రాముల బంగారం కొనుగోలు చేశారు. రాహుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఓటీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం నాలుగు రాష్ట్రాల్లో గాలించి నిందితుల ఆచూకీ కనిపెట్టింది. రాజు నాంగ్రేకు చెందిన మరో వాహనాన్నీ కొల్లగొట్టాలని పథకం వేసిన వీరు జహీరాబాద్ ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వీరిచ్చిన సమా చారంతో కరాడ్ వెళ్లి సుజాత, సునీతలను అరెస్టు చేసుకువచ్చారు.