తాగి నడిపితే జైలుకే..

13 Jul, 2018 12:21 IST|Sakshi
డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న మంచిర్యాల ట్రాఫిక్‌ పోలీసులు(ఫైల్‌)

మంచిర్యాలక్రైం: మద్యం తాగి వాహనాలు నడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ డ్రైవింగ్‌ ప్రమాదమని తెలిసినా మత్తులోనే వాహనం నడుపుతున్నారు. వారు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతరుల మరణాలకూ కారణమవుతున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ తాగి వాహనం నడిపే వారిని జైలుకు పంపిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు
రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు రోజురోజుకు పెరుతుండడంతో ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. మద్యం తాగి వాహనాలు నడపడంతో మంచిర్యాల జిల్లాలో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారిపై మంచిర్యాల జిల్లా మీదుగా వెళ్లడంతో  మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించేందుకు శ్రీరాంపూర్, సీసీసీ, ఏసీసీ, పాత మంచిర్యాల సమీపంలో పోలీసులు తరుచూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాలకు ప్రధాన కేంద్రం మంచిర్యాల కావడంతో నిత్యం రోజుకు లక్షాలాది మంది ప్రజలు వ్యాపారులు, ఉద్యోగులు, మంచిర్యాలకు వచ్చి పోతుంటారు. ఈ  క్రమంలో ఇక్కడనే మందు, విందు అన్ని రకాల పనులు చేసుకొని వెళ్తుంటారు. ఈ క్రమంలో శ్రీరాంపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై, శ్రీ రాంపూర్, లక్సెట్టిపేట వైపునకు వెళ్లే రహదారులపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే రహస్యంగా బెల్ట్‌షాపులు, దాబాల్లో అక్రమ సిట్టింగులు ఉండటంతో వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది.
 
పర్సెంటేజీ ప్రకారమే శిక్ష
డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మద్యం తాగిన పర్సేంటేజీని బట్టి కేసు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపే విధానాన్ని ఖరారు చేశారు. సుమారు 30కి పైగా పర్సెంటేజీ వస్తే పోలీసులే జరిమానా విధించి, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తున్నారు. రెండుసార్లు పట్టుబడితే కేసులు నమోదు చేసి జైలుపు పంపుతున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత మూడేళ్లలో 9,477 మందిపై కేసులు నమోదు కాగా, ఇందులో 459 మంది జైలుకు వెళ్లారు. శిక్ష పడిన వారి లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారు ప్రమాదంలో మృతి చెందినా, గాయపడ్డ ఎలాంటి బీమా సదుపాయం వర్తించదని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడం గమనార్హం.

అవగాహన కల్పిస్తున్నా..
జిల్లాలో డ్రంకన్‌ డ్రైవ్‌తో జరుగుతున్న ప్రమాదాల నివారణకు పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీడ్రైవర్లు ఇతర ప్రైవేటు వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌ జిత్‌ దుగ్గల్‌ ఇటీవల కళాకారుల మద్యం, పేకాట, డ్రంకన్‌ డ్రైవ్, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల నిర్మూలనకు కళాబృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాబృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కళాబృందాలతో ఆటాపాటల ద్వారా మద్యం తాగడం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా మందుబాబులు పట్టుపడుతూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు