‘నిషా’చరి...కటకటాల దారి!

19 Jan, 2019 14:03 IST|Sakshi
బ్రీత్‌ అనలైజర్‌తో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టు నిర్వహిస్తున్న పోలీసులు

18 రోజుల్లో 905 కేసుల నమోదు  

ఏడాది కాలంలో 1,352 మంది మందుబాబులకు జైలు శిక్ష  

కేసు నమోదులోనే మానసిక స్థితిపై నివేదిక  

కర్నూలు : మద్యం మత్తులో వాహన ప్రమాదాలు చేస్తూ ప్రాణాలు బలికొంటున్న మందు బాబులకు  పోలీసులు షాక్‌ ఇస్తున్నారు. పండగ వేళ తమను ఎవరు పట్టుకుంటారులే అనే ధీమాతో తాగి వాహనం నడిపినవారిని పట్టుకుని కటకటాలకు పంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారం రోజుల్లో సుమారు 500 మందికి పైగా మందుబాబులను పట్టుకున్నారు. గతంలో నెల రోజుల్లో సగటున 500 నుంచి 600 మంది దొరుకుతుండగా జనవరి నెల తొలి 15 రోజుల్లోనే 905 మంది చిక్కారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. పోలీసు నివేదికలు పరిశీలించిన న్యాయమూర్తులు సుమారు 25 మందికి జైలు శిక్ష విధించారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ ఆఖరు వరకు జిల్లాలో సుమారు 1,352 మంది మందుబాబులు జైలు శిక్ష అనుభవించారు.  

లెక్క దాటుతున్నారు...  
బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సంట్రేషన్‌ (బీఏసీ) ప్రమాణాల మేరకు ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో మద్యం మోతాదు (ఆల్కహాల్‌ కంటెంట్‌) 30 మిల్లీ గ్రాములకు మించకూడదు. బ్రీత్‌ అనలైజర్లతో పరీక్షలో చాలా మందికి 100 మిల్లీ గ్రాములను దాటేస్తోంది. ఇటీవల డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన ఓ డాక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడిని పరీక్షించగా 131 మిల్లీ గ్రాముల మద్యం మోతాదు కనిపించినట్లు ట్రాఫిక్‌ అధికారి ఒకరు తెలిపారు. మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బీఏసీ 105 మిల్లీ గ్రాములుగా నమోదైంది. వ్యాపార రంగంలో ఉన్న ప్రముఖుడి బీఏసీ 106 మిల్లీ గ్రాములు రికార్డు అయింది. తనిఖీల్లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది బీఏసీ 75 నుంచి 90 మిల్లీగ్రాముల లోపు ఉండగా, కొందరు యువకుల్లో 300 మిల్లీగ్రాములు దాటి ఉంది.  మద్యం నిషాలో వాహనాలు నడిపేటప్పుడు అయోమయం, ఆందోళనకు గురై ప్రమాదాలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలామంది  ఆ సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతారు.

కేసు నమోదులోనే మానసిక స్థితిపై నివేదిక  
రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రహదారి భద్రతపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు  అమలు చేస్తూ  జిల్లాలో ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించాలని  నిర్ణయించారు. వాహన చోదకులపై పోలీసులు కేసులు నమోదు సమయంలోనే నేరం తీరు, వాహన చోదకుడి మానసిక స్థితి, అతని ప్రవర్తన, ఇతర అంశాలతో న్యాయస్థానంలో అభియోగ పత్రాలు సమర్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినవారు గతంలో ఈ తరహా నేరం చేసి ఉంటే ఆ వివరాలు, మోతాదుకు మించి తాగిన వ్యక్తి పట్టుబడినప్పుడు ఎంత మత్తులో ఉన్నాడు, అతడు వాహనాన్ని అలాగే నడుపుకుంటూ వెళ్తే ఎన్ని ప్రమాదాలు జరిగేవి అనే అంశాలను వివరిస్తూ కోర్టులకు నివేదికలు సమర్పిస్తున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లిన వాహనదారులు   చలానాలు విధించినా కట్టడం లేదు. అలాంటి వారిని గుర్తించే కసరత్తు ప్రస్తుతం జరుగుతోంది.  

ఏడాదిలో 1,352 మంది జైలుకు  
మోతాదుకు మించి తాగి డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన నిందితులకు న్యాయస్థానాలు కనిష్టంగా ఒక రోజు, గరిష్టంగా మూడు రోజులు జైలు శిక్షలు విధిస్తున్నాయి. ఎక్కువ మందికి ట్రాఫిక్‌ స్టేషన్లలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మార్పు రాని వారిని న్యాయస్థానాల్లో హాజరుపరుస్తున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 6,270 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా, అండర్‌ సెక్షన్‌ 252 సీఆర్‌పీసీ ద్వారా ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానాతో పాటు 1,352 మందికి జైలు శిక్ష పడింది.

ప్రమాదాలు చేసే వారిని కట్టడి చేసేందుకే..
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్నవారిని కట్టడి చేసేందుకే ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు డ్రంకెన్‌ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. ప్రతి మంగళ, బుధ, ఆదివారాల్లో జిల్లాలోని ఆరు పోలీస్‌ సబ్‌ డివిజన్ల పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. గతంలో ముఖ్య పట్టణాల్లో మాత్రమే డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టేవారు. రెండు నెలల కాలంగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. పట్టుబడి జైలుకు వెళ్తే భవిష్యత్తులో వారికి పాస్‌పోర్టు, వీసా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే సందర్భాల్లో ఆ  ప్రభావం  సంబంధిత వ్యక్తిపై పడుతుంది.– ఎన్‌.సుధాకర్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ 

మరిన్ని వార్తలు