ఫుల్లుగా తాగేసి.. అంబులెన్స్‌ను ఢీకొట్టారు!

21 Mar, 2020 10:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాగిన మైకంలో నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తూ అంబులెన్స్‌ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటన హస్తినపురం అమ్మ హాస్పిటల్‌ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్‌, అజయ్‌, రాకేష్‌, శ్రీకాంత్‌ డిగ్రీ స్నేహితులు. మన్నెగూడలో ఓ పుట్టినరోజు వేడుకలో పాల్గొని కారులో తిరిగి వస్తున్నారు. వారు సరూర్‌ వెళ్లే క్రమంలో హస్తినపురం ఆస్పత్రి రోడ్డులో అతి వేగంగా వస్తూ రోడ్డు పక్కన నిలిచిఉన్న అంబులెన్స్‌ వాహనాన్ని ఢీకొట్టారు. యువకులు మద్యం మత్తులో ఉన్నారు.

కారులో మద్యం బాటిళ్లు, చికెన్‌ లభించింది. అయితే, వారు సీట్‌ బెల్టు ధరించడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో యువకులు బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకులకు పరీక్షలు చేయగా.. కారు నడుపుతున్న వ్యక్తి జగదీశ్‌కు ఆల్కహాల్‌ రీడింగ్‌ 120 వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్‌ డీసీపీ యాదగిరి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


 

మరిన్ని వార్తలు