కొన్ని గంటల్లో కూతురి పెళ్లి.. తండ్రి ఘాతుకం

23 Mar, 2018 09:03 IST|Sakshi
నిందితుడు రాజన్, కూతురు అథిర

సాక్షి, తిరువనంతపురం : కేరళలో దారుణం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో దళితుడిని వివాహం చేసుకోబోతుందన్న కోపంతో తన కూతురిని ఓ తండ్రి కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి హత్య చేశాడు. మలప్పురం జిల్లా పతనపురం గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఆర్‌. అథిర అనే యువతి ఓ ఆర్మీ జవాన్‌ను ప్రేమించింది. అయితే ఆర్మీ జవాన్‌ దళితుడు కావడంతో ఆమె తల్లితండ్రులు తొలుత వీరి పెళ్లికి నిరాకరించారు. చివరికి ఆ ప్రేమికులు అతికష్టం మీద తల్లిదండ్రులను తమ పెళ్లికి ఒప్పించారు.

అరికోడ్‌లోని ఓ దేవాలయంలో శుక్రవారం వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటవుతామని ఆ ప్రేమ జంట భావించింది. కుమార్తె దళితుడిని చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అథిర తండ్రి ఆర్‌ రాజన్‌ మద్యం సేవించి వచ్చాడు. అతడిని పెళ్లి చేసుకోవద్దంటూ గొడవకు దిగాడు. పెళ్లికి అడ్డంకులు తొలగిపోయి అంతా ఓకే అనుకున్న సమయంలో తండ్రి రివర్స్ కావడం వధువును ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు నచ్చజెప్పాలని చూస్తున్న కూతురిని వెంట తెచ్చుకున్న కత్తితో రాజన్ విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. వధువును కోజికోడ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పరువు హత్యకు పాల్పడిన రాజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

మరిన్ని వార్తలు