దారుణం : పసిపాపకు మద్యం తాగించిన తండ్రి!

6 Apr, 2019 15:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. సొంత బిడ్డకు పాల సీసాలో మద్యం పట్టించిన ఓ కసాయి తండ్రి ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకోగా..  స్థానికులు చొరవతో ఢిల్లీ మహిళా కమిషన్‌ ఆ పసిపాపను రక్షించింది. గత మూడురోజులుగా ఆ పాపకు తన తండ్రి ఆహారం పెట్టడంలేదని అందిన ఫిర్యాదుకు స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్‌కు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ఆ పసిపాపను రక్షించడం కోసం కమిషన్‌ సభ్యులు అక్కడికి వెళ్లగా..  తీవ్ర విరేచనాలు చేసుకోని గదిలో అచేతన స్థితిలో ఉన్నఆ పసిపాప కనిపించింది. ఆ పాప పక్కనే ఫుల్‌గా తాగి ఏమాత్రం సోయి లేకుండా ఆ చిన్నారి తండ్రి పడి ఉన్నాడు. అతని లేపడానికి ప్రయత్నించిన కమిషన్‌ సభ్యులను నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. వారి పక్కనే ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. వెంటనే ఆ పాపను సమీప ఆసుపత్రికి తరలించిన మహిళా కమిషన్‌ సభ్యులూ.. పోలీసులకు సమాచారం అందించి ఆ కసాయి తండ్రిని అరెస్ట్‌ చేయించారు. 

ఏడాది క్రితం ఆ పాప తల్లి మరణించిందని, ఆమె తండ్రి రిక్షా తోలి ఫుల్‌గా మద్యం తాగుతాడని చుట్టుపక్కల వాళ్లు ఈ సందర్బంగా మహిళా కమిషన్‌ సభ్యులకు తెలిపారు. అంతేకాకుండా అతను పనికి వెళ్లేటప్పుడు తన కూతురుని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్తాడని, పక్కని వారినెవ్వరని సాయం చేయనియ్యడని పేర్కొన్నారు. ఆ పాప ఆకలితో రోజు ఏడుస్తూనే ఉండేదని, ఏడ్వకుండా పాపకు పాలసీసాలో లిక్కర్‌ పోసి తాగించేవాడని చెప్పారు. దీనికి చలించిన ఢిల్లీ మహిళా కమిషన్‌ ఆ కసాయి తండ్రిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించింది. ఆ పాప ఆరోగ్యం కుదుట పడిన తర్వాత షెల్టర్‌ హోమ్‌కు తరలిస్తామని పేర్కొంది.

మరిన్ని వార్తలు