ఒరేయ్‌ అన్నాడని మిత్రుడి ప్రాణం తీశాడు

22 Jan, 2020 08:35 IST|Sakshi
సుధీర్‌ (ఫైల్‌)

బీరు సీసాతో గొంతులో పొడిచి హత్య

భాగ్యనగర్‌కాలనీ: ఒరేయ్‌.. అన్నాడని ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. తోటి స్నేహితుణ్ని బీరు సీసా పగులగొట్టి గొంతులో పొడిచి హత్య చేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.  సీఐ లక్ష్మీనారాయణరెడ్డి కథనం ప్రకారం.. మూసాపేట యాదవ బస్తీలో తాడెల లక్ష్మి, ఆమె కుమారుడు సుధీర్‌ (20) నివాసముంటున్నారు. పెయింటింగ్‌ పనిచేసే సుధీర్‌ సోమవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తర్వాత రూ.50 తీసుకొని స్నేహితులైన గురజాల కిరణ్, నవీన్, రాంబాబులతో కలిసి బయటికి వెళ్లాడు. ఖైత్లాపూర్‌ సమీపంలోని గ్రౌండ్‌లో మద్యం తాగారు. ఆ సమయంలో మరికొంత మంది స్నేహితులైన కిరణ్, సాబేర్, హర్షవర్ధన్‌లు కూడా వీరికి తోడయ్యారు.

అంతా కలిసి మద్యం తాగారు అనంతరం కిరణ్, రాంబాబు, హర్షవర్ధన్‌లు ఇంటికి వెళ్లి పోయారు. అక్కడే ఉన్న కిరణ్, నవీన్, సాబేర్‌లు సుధీర్‌తో మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో సుధీర్‌ని అరటి పండ్ల విక్రయ వ్యాపారి సాబేర్‌ ఒరేయ్‌ అన్నాడు. సుధీర్‌ ఒరేయ్‌ అంటావా అని నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగటంతో సుధీర్‌ను  సాబేర్‌ పక్కకు తీసుకెళ్లి బీరు బాటిల్‌ పగులగొట్టి  గొంతులో పొడిచాడు.  దీంతో వెంటనే సుధీర్‌ కింద పడిపోవటంతో సాబేర్‌ అక్కడి నుంచి స్కూటీపై పారిపోయాడు. అక్కడే ఉన్న తోటి స్నేహితులు నవీన్, కిరణ్‌లు వెంటనే సుధీర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుధీర్‌ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు