నేనే డ్రైవర్‌...నేనే కండక్టర్‌

18 Feb, 2020 03:09 IST|Sakshi
అపరిచిత వ్యక్తి వదిలేసిన బస్సు వద్ద ప్రయాణికులు

తాండూరు టౌన్‌: తప్పతాగిన ఓ వ్యక్తి ప్రయాణికులతో ఉన్న బస్సును తీసుకెళ్లాడు. ‘నేనే డ్రైవర్‌ను.. నేనే కండక్టర్‌ను.. డబ్బులు ఇవ్వండి’ అంటూ ప్రయాణికులకు ఆదేశించాడు. అంతలోనే బస్సు లారీని ఢీకొనడంతో అతను పరారయ్యాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 21 జెడ్‌ 437) ఓగీపూర్‌కు వెళ్లాల్సి ఉంది. డ్రైవర్‌ ఇలియాస్, కండక్టర్‌ జగదీశ్‌ బస్టాండ్‌లో పాయింట్‌ మీద ఉంచి భోజనం చేసేందుకు వెళ్లారు.

ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి బస్సును స్టార్ట్‌ చేసి ఇందిరాచౌక్‌ మీదుగా మల్లప్పమడిగ వైపు తీసుకెళ్లాడు. ‘నేనే కండక్టర్‌ను.. నేనే డ్రైవర్‌ను.. అందరూ డబ్బులు ఇవ్వాలి’అని అన్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ఓ లారీని ఢీకొట్టడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన ప్రయాణికులు సదరు వ్యక్తిని నిలదీయడంతో బస్సును నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తాండూరు డీఎం రాజశేఖర్‌ అక్కడికి చేరుకొని బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. ఘటనపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు