మద్యం మత్తులో కొడవలితో వీరంగం

6 Oct, 2019 08:12 IST|Sakshi
దాడిలో గాయపడ్డ అర్జున్, బాలునాయక్‌

మద్యంషాపు యజమాని, వాచ్‌మన్‌పై దాడి

ఉప్పల్‌:  రామంతాపూర్‌లో ఓ మద్యం దుకాణం వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు.  యజమాని, వాచ్‌మన్‌పై కొడవలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం  రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉప్పల్‌ కళ్యాణపురి ప్రాంతానికి చెందిన పన్నాల అర్జున్‌  రామంతాపూర్‌లో రాజరాజేశ్వరి పేరు మీద వైన్స్‌ నడుపుతున్నాడు. రామంతాపూర్‌ ఇందిరానగర్‌కు చెందిన సురుగు చంద్రశేఖర్‌(23), అతని బావ కందుకరి సురేష్‌(23)తో కలిసి రామంతాపూర్‌లో రాజరాజేశ్వరి వైన్స్‌కు వచ్చారు.

ఏటిఎం కార్డు ద్వారా మద్యం కొనుగోలు చేశారు. తరువాత ఏటీఎం కార్డును వాడి మరికొంత నగదును ఇవ్వాలని కౌంటర్‌లో ఉన్న వ్యక్తిని డిమాండ్‌ చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో  వీరిద్దరి మధ్యా  వాగ్వాదం జరిగింది.  కోపంతో వెళ్లిన చంద్రశేఖర్‌ ఇంటికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టే కొడవలి  తీసుకుని  స్నేహితుడు సాయికిరణ్‌(22), సోదరుడు కార్తీక్‌(20)తో కలిసి మద్యం షాపు వద్దకు వచ్చారు. మద్యం మత్తులో అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ బాలు నాయక్‌పై కత్తితో దాడికి తెగపడ్డారు. అడ్డువచ్చిన మద్యం షాపు యజమాని పన్నాల అర్జున్‌ ముఖంపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయారు.    సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  బాధితులను చికిత్స నిమిత్తం రామంతాపూర్‌లోని మ్యాట్రిక్‌ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన చంద్రశేఖర్, సురేష్, కార్తీక్, సాయికూమార్‌లపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌  వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు