కీచక డీటీ సస్పెన్షన్‌

16 May, 2018 13:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయనగరం గంటస్తంభం : ఆయన బాధ్యత గల అధికారి. కార్యాలయానికి ఎవరూ వచ్చి నా మంచిగా, మర్యాదగా మాట్లాడి పని చేసి పంపాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.  బాధ్యత మరిచి, కామ పురాణాన్ని వినిపించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం,  లైంగికంగా వేధించడం ఆయన నైజం. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి రావడంతో సదరు డీటీపై కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ వేటు వేశారు. సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే... నెల్లిమర్ల హెడ్‌క్వార్టర్‌ డిప్యూటీ తహసీల్దారు(హెచ్‌డీటీ) షేక్‌ ఇబ్రహిం కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధించే విధంగా మాట్లాడేవారు. మహిళా ఉద్యోగులపై ఆయన ప్రవర్తన అదే విధంగా ఉండడంతో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు ఫిర్యా దు అందింది. దీంతో వర్కింగ్‌ ప్లేస్‌ మహిళా వేధింపులు జిల్లా కమిటీని దీనిపై విచారణ చేయాలని ఆదేశించారు.

కమిటీ చైర్మన్, కేఆర్సీ ఎస్డీసీ ఆర్‌.శ్రీలత, సభ్యులుగా ఉన్న విపత్తుల నిర్వహణ డీపీఎం పద్మావతి, కలెక్టరేట్‌ సీ సెక్షన్‌ సూపరిండెంటెంట్‌ అంజనీకుమారి విచారణ చేశారు. విచారణలో వేధింపులు నిజమని తేలడంతో కమిటీ కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. దీంతో ఆయనను సస్పెన్షన్‌ చేస్తూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు.

డీటీపై గతంలో కూడా లైగింక వేధింపులు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై ఒకసారి సస్సెన్షన్‌కు గురయ్యారు. గతంలో భోగాపురం హెచ్‌డీటీగా పని చేస్తున్న సమయంలో ఇదే విధంగా మహిళా ఉద్యోగులను లైంగింకంగా వేధిస్తున్నారన్న ఫిర్యాదు అందింది. దీనిపై అప్పట్లో విచారణ చేయగా నిజమని తేలడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు.  ఇలా రెండుసార్లు ఆయనపై ఇలాంటి ఆరోపణలు రుజువైనా సస్పెన్షన్‌లతో సరిపెట్టడం విమర్శలకు తావి స్తోంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాలని  మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు