ముస్సోరి: సరదాగా సాగుతున్న పడవ ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. స్టోన్ కౌంటీలోని టేబుల్ రాక్ నదిలో గురువారం సాయంత్రం పడవ నీట మునిగింది. 31 మందితో ప్రకృతి అందాలను తిలకించడానికి బయల్దేరిన డక్ బోట్ (బాతు పడవ) నది మధ్యలో ఉండగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు విరుచుకుపడడంతో అలలు ఎగసిపడి పడవ నీట మునిగింది.
శాంతంగా ఉన్న నదీ జలాలు తుపాను కారణంగా ఉగ్ర రూపం దాల్చి 13 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఘటనలో నలుగురు గల్లంతవగా మరో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి గురవుతున్న పడవను దూరంగా ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడయాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ప్రయాణీకుల హాహాకారాలు, పడవ ప్రమాదం ఆసాంతం వీడియోలో నిక్షిప్తమైంది.