ప్రాణాలు తీసిన ఎక్సర్‌సైజ్‌

29 Apr, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జిమ్‌లో అధిక సమయం ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పట్టణంలోని ఎస్‌ ఆర్‌ నగర్‌లో చోటు చేసుకుంది‌. వివరాలు.. పంజాబ్‌కు చెందిన ఆదిత్య నగరంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం ఆదిత్య ఎస్‌ ఆర్‌ నగర్‌లోని గోల్డెన్‌ జిమ్‌లో చేరాడు. రోజులానే సోమవారం ఉదయం జిమ్‌లో చాలాసేపు ఎక్సర్‌సైజ్‌ చేస్తూ గడిపాడు. దాంతో ఒక్కసారిగా నీరసించి ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన జిమ్‌ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లేట్‌ ఇచ్చారు.

టాబ్లెట్‌ వేసుకున్న తర్వాత ఆదిత్య పరిస్థితి మరింత విషమంగా మారింది. చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్థారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిమ్‌లో అధిక సమయం ఎక్సర్‌సైజ్‌ చేయించడం వల్లే ఆదిత్య చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. అంతేకాక గోల్డెన్‌ జిమ్‌పై ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు