ఈఎస్‌ఐ కుంభకోణంపై ఈడీ విచారణ

30 Dec, 2019 12:06 IST|Sakshi

దేవికారాణి కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేపట్టింది. ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌లో నిందితురాలైన దేవికా రాణి చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. మనీ  లాండరింగ్‌ కింద  కేసు నమోదు చేసిన ఈడీ.. దేవికారాణిని  కస్టడీ కోరుతూ నేడు పిటిషన్‌ దాఖలు చేయనుంది. 200 కోట్ల వ్యవహారంలో దేవికారాణిని ఈడీ విచారించనుంది. అధికారంలో ఉండగా ఆమె పెద్ద మొత్తంలో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఫార్మా కంపెనీలతో పాటు దేవికారాణి సొంతంగా షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారు. షెల్‌ కంపెనీల ద్వారా దేవికా రాణి  పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది.

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికా రాణిపై మనీ లాండరింగ్‌ కేసును ఈడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ఐఎంఎస్‌ స్కామ్‌లో నిందితురాలైన ఆమె విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. ఏసీబీ వద్ద ఉన్న ఆస్తుల చిట్టా ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే దేవికా రాణిపై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్‌ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది.

మరిన్ని వార్తలు