సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకు నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ కోసం గంటల తరబడి నిలబడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన అత్తిలి మండలం మంచిలిలో జరిగింది. వివరాలలోకి వెళితే.. మంచిలికి చెందిన కర్రి వెంకటరెడ్డి అనే 75ఏళ్ల వృద్ధుడు పెన్షన్ తీసుకోవటానికి మంచిలి పంచాయితీకి వచ్చాడు. సాయంత్రం నాలుగు గంటలకి ఎమ్మెల్యే వస్తారని.. ఉదయం 9 గంటలలోపు వచ్చిన వారికే పెరిగిన పెన్షన్ ఇస్తామని పంచాయితీ అధికారులు మెలిక పెట్టడంతో ఎక్కువమంది అక్కడికి వచ్చారు.
పెన్షన్ కోసం చాలా సేపు నిలబడి అలిసిపోయిన వెంకటరెడ్డి.. చివరకు పెన్షన్ తీసుకోకుండానే ప్రాణాలు విడిచాడు. దీంతో పంచాయతీ సిబ్బంది చనిపోయిన వృద్ధుడి పెన్షన్ డబ్బులు హుటాహుటిన అతడి ఇంటికి తెచ్చి ఇచ్చారు.