కథలు చెప్పే తాతలు కామాంధులై..

8 Sep, 2018 13:54 IST|Sakshi

చిన్నారులపై అఘాయిత్యానికి యత్నం

తాడేపల్లి నులకపేటలో దారుణం

మనవరాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీయాల్సిన వృద్ధులు.. మదమెక్కిన మృగాలుగా మారుతున్నారు. తాతయ్యా అనే పిలుపుతో ఆనందాన్ని పొందాల్సిన కొందరు.. పసిమొగ్గలపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కమ్మని కథలు చెప్పి.. పిల్లల స్వచ్ఛమైన నవ్వుల్లో సంతోషాన్ని వెతుక్కోవాల్సిన ముదిమిలో.. కామపిశాచాలై రెచ్చిపోతున్నారు. శుక్రవారం జిల్లాలోని గుంటూరు, తాడేపల్లి మండలం నులకపేటలో ఇద్దరు వృద్ధులు బాలికలపై లైంగిక దాడికి యత్నించారు.     సమాజపు విలువలను పాతాళంలోకి నెట్టేశారు.

గుంటూరు, తాడేపల్లిరూరల్‌:  తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. మనవరాలు వయసున్న చిన్నారులపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... నులకపేట రేంజ్‌ వద్ద నివాసం ఉండే యాభై సంవత్సరాల బెల్లం తిరుపతిరావుకు ఇద్దరు కుమార్తెలు. వారిరువురికి పెళ్లిళ్లయ్యాయి. భార్య ఇటీవల కూతుళ్లను చూసిరావడానికి వారింటికి వెళ్లింది. ఇంట్లో తిరుపతిరావు ఒక్కడే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పక్క ఇంట్లో నివాసం ఉంటున్న 13 ఏళ్ల వయసు బాలికను, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో 9 ఏళ్ల బాలికను మామ్మ పిలుస్తుంది రండంటూ, చేతులు పట్టుకొని ఇంటికి లాక్కెళ్లబోయాడు.

అయితే 13 ఏళ్ల బాలిక మామ్మ లేదు కదా, మేం ఇంటికి రామంటూ విడిపించుకొని పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. రెండో బాలికను తిరుపతిరావు తన ఇంట్లోకి తీసుకువెళ్లి, తలుపులు వేసి, అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నం చేశాడు. పారిపోయిన రెండో బాలిక తన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె తిరుపతిరావు ఇంటికి వచ్చి తలుపులు తెరవమని అరవగా, తిరుపతిరావు తలుపులు తెరవలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వారిని పిలవడంతో, గమనించిన తిరుపతిరావు తలుపులు తీసుకుని ఇంట్లోనుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనపై స్థానికులు 100కు ఫోన్‌ చేసి చెప్పగా, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు