కనిపిస్తే చంపేస్తోంది..

4 Feb, 2018 19:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రుతిమించిన ఒంటరి ఏనుగు ఆగడాలు

చిన్నారు వద్ద దాడిలో మరో వ్యక్తి మృతి

క్రిష్ణగిరి : సూళగిరి సమీపంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. తాను వెళ్లే దారిలో ఎవరు కనిపించినా దాడి చేసి ప్రాణాలు తీస్తోంది. శనివారం ఉదయం ఓ వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు అదే రోజు రాత్రి మరోమారు స్వైర విహారం చేసింది. నడిచి వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. దీంతో సూళగిరి ప్రాంత ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోని భీతిల్లుతున్నారు.

సూళగిరి సమీపంలోని దేవరగుట్టపల్లి గ్రామానికి చెందిన మునిరాజు(55) శనివారం రాత్రి చిన్నారు వద్ద నడచి వెళ్తుండగా ఏనుగు దాడి చేసి అంతమొందించింది. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగులను తరిమివేయకపోవడం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు దిగారు. వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్‌ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది.

జిల్లా కలెక్టర్‌ సి.కదిరవన్, జిల్లా అటవీశాఖాధికారి దీపక్‌విల్జీలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డెంకణీకోట, రాయకోట, క్రిష్ణగిరి, శ్యానమావు, సూళగిరి అటవీశాఖ బృందాలను రప్పించారు. పశువైద్యులు ప్రకాష్‌ బృందాన్ని రంగంలోకి దింపారు. మత్తుమందు ఇచ్చి ఏనుగును బంధించేందుకు చర్యలు చేపట్టడంతో స్థానికులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు మునిరాజు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య క్రిష్ణమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు