పట్నా : యజమాని భార్యతో వివాహేతర సంబంధం నడిపిన ఓ వ్యక్తికి స్థానిక ప్రజలు దారుణమైన శిక్షను విధించారు. వివాహితతో పారిపోయిన ఆ వ్యక్తిని పట్టుకుని కళ్లలో యాసిడ్ పోశారు. దీంతో అతను కంటి చూపును కోల్పోయాడు. బిహార్ పిప్రా చౌక్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే... సమస్తిపూర్ జిల్లా బరౌనీ గ్రామానికి చెందిన వ్యక్తి(30) ఓ రైతు దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను యజమాని భార్యతోనే వివాహేతర సంబంధం నడిపాడు. ఫిబ్రవరి 6న ఆమెతోపాటు కొంత డబ్బుతో ఉడాయించాడు. దీనిపై ఆ యాజమాని తెగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కిడ్నాప్, దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఫిబ్రవరి 16న ఆమె స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కు వచ్చి భర్త దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీంతో పోలీసులు అనుమానంతో అసలు విషయం ఆరా తీశారు.
అదే రోజు ఉదయం పిప్రా చౌక్ వద్ద ఓ హోటల్ వీరిని పట్టుకున్న గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. ఆపై సిరంజీతో ఆ యువకుడి కళ్లలో యాసిడ్ కొట్టారు. దాడి అనంతరం హనుమాన్ చౌక్లో అతన్ని పడేసి వెళ్లిపోగా.. మహిళను బెదిరించటంతో ఆమె స్టేషన్కు వచ్చి భర్త దగ్గరికి వెళ్తానంటూ చెప్పింది. ఇక బాధితుణ్ణి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి ఆస్పత్రిలో చేర్పించాడు. బాధితుడి స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెగ్రా పోలీసులు వెల్లడించారు.