తాహిర్‌ హుస్సేన్‌పై మనీలాండరింగ్‌  కేసు

12 Mar, 2020 08:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగి అంకిత్‌ శర్మ హత్యతో పాటు ఢిల్లీలో హింసాకాండకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌  మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. అతనికి పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ  కోణం నుంచి కూడా దర్యాప్తు జరుపుతున్నారు.ï తాహిర్‌ హుస్సేన్‌తో పాటు పీఎఫ్‌ఐపై మనీలాండరింగ్‌తో పాటు ఇటీవలి ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు నిధులు అందించారన్న ఆరోపణలపై  ఎన్‌ఫోర్స్‌మెంట్‌  డైరక్టరేట్‌ కేసు నమోదుచేసిందని అధికారులు బుధవారం తెలిపారు. 

ప్రçస్తుతం తాహిర్‌ హుస్సేన్‌ పోలీసు కస్టడీలో ఉన్నాడు. పోలీసు నిర్భంధం ముగిసిన వెంటనే ఈడీ అతనిని అరెస్టు చేయనుంది. తాహిర్‌ను పోలీసులు గతవారం అరెస్టు చేశారు.ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు నిధులు అందించిన హుస్సేన్‌తో పాటు ఇంకాకొంత మందిని మనీలాండరింగ్‌Š, అక్రమ నిధుల తరలింపు ఆరోçపణలపై దర్యాప్తు చేయడంతో పాటు ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ దాఖలుచేసిన ఎఫ్‌ఐఆర్‌లను కూడా ఈడీ పరిగణనలోకి తీసుకుంటుంది. తాహిర్‌కు అక్రమ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. 

ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ఖజూరీ ప్రాంతంలోని తాహిర్‌ హుస్సేన్‌కు చెందిన భవనంపై నుంచి రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తాహిర్‌హుస్సేన్‌కు చెందిన భవనం నుంచి హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో పాటు అంకిత్‌ శర్మ హత్యకు సంబంధించిన ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈశాన్య ఢిల్లీ హింసాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తాహిర్‌పై మొత్తం నాలుగు కేసులు నమోదుచేశారు. ఇందులో ఇంటలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌శర్మ హత్య కేసు కూడా ఉంది. అంకిత్‌ తండ్రి ఆరోపణల మేరకు ఈ కేసు నమోదుచేశారు. అది కాక సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మరికొన్ని కేసులు కూడా నమోదుచేశారు. కరావల్‌ నగర్‌లో ఉన్న తాహిర్‌ హుస్సేన్‌ ఇంటి బయట పోలీసులు ఇంకా నిత్యం పహారా కాస్తున్నారు. తాహిర్‌ సోదరుడు మహ్మద్‌ షా ఆలం కూడా హింసాకాండలో పాలు పంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై అతనిని పోలీసులు విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు