ఈఎస్‌ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్‌

7 Oct, 2019 17:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌లు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఈఎస్‌ఐకి చెందిన ఇన్యూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ అరవింద్‌ రెడ్డి, కె.రామిరెడ్డి, కె. లిఖిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.  వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ ఎండీగా కొనసాగుతున్న అరవింద్‌ రెడ్డి ఈఎస్‌ఐకి పరికరాలు సరఫరా చేసినట్లు డబ్బులు కాజేశారు. జాయింట్‌ డైరెక్టర్‌ పద్మతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు.  2013 నుంచి అరవింద్‌ రెడ్డి ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇప్పటివరకూ అరెస్ట్‌ల సంఖ్య 13కు చేరింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా ఈఎస్‌ఐ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన నాలుగేళ్ళలో రూ. 1000 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏటా సుమారు రూ. 250కోట్ల మందులు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం దర్యాప్తులో భాగంగా.. పలు మెడికల్‌ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు