సీబీఎస్‌ఈ టాపర్‌పై సామూహిక అత్యాచారం!

14 Sep, 2018 12:21 IST|Sakshi

చంఢీఘర్‌: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. గతంలో సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌లో టాపర్‌గా నిలిచి.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రేవారి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. బుధవారం ఊరికి సమీపంలోని కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారని పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితులు స్పృహ కొల్పోయిన బాధితురాలిని బస్టాండ్‌ సమీపంలో పారేసి వెళ్లిపోయారు. నిందితులంతా తమ ఊరికి చెందిన వారేనని బాధితురాలు పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు సాయంతో పోలీసులను ఆశ్రయించారు. 

ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పోలీసులు తొలుత తమ ఫిర్యాదును స్వీకరించడానికి ముందుకు రాలేదని తెలిపారు. నిందితులు పోలీసులను బెదిరించారని.. తాము కేసు నమోదు చేయడానికి పలు పోలీసు స్టేషన్‌లు తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ తమ కూతురిని ప్రశంసించారని తెలిపారు. మోదీ బేటీ బచావో భేటీ పచావో అంటారని.. కానీ అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తమ కూతురికి న్యాయం జరగాలని డిమాండు చేశారు. ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేపట్టలేదని పేర్కొన్నారు. 

బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన ఓ పోలీసు అధికారి.. ఘటన జరిగిన ప్రదేశం ఆయన స్టేషన్‌ పరిధిలో రాకపోవడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా దీనిని శుక్రవారం ఉదయం రెగ్యూలర్‌ ఎఫ్‌ఐఆర్‌గా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు