తూర్పు గోదావరిలో బాణాసంచా పేలుడు కలకలం

18 Oct, 2019 19:27 IST|Sakshi

బాధితులను పరామార్శించిన మంత్రి కన్నబాబు

సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ జీ వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని కాకినాడ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన పార్వతీపరమేశ్వర ఫైర్‌ వర్క్స్‌కు అనుమతులు ఉన్నాయని తెలిపారు. చిచ్చుబుడ్డులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని చెప్పారు.

గత నెల 30న సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణసంచా పేలుడు చోటుచేసుకున్న తరువాత అన్ని తయారీ కేంద్రాలకు క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా.. తయారీ కేంద్రం యాజమాని అంజనేయులు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నలుగురికి మించి పని చేయిస్తున్నట్లు గుర్తించి హెచ్చరించామన్నారు. కాగా బాణసంచా పేలుడు ఘటనలోని క్షతగాత్రుల వివరాలిలా ఉన్నాయి...  ఎర్రంనీడి సత్యం(50), నీలం వెంకటేష్(18), నీలం రామకృష్ణ(35), ఎర్రంనీడి బ్రహ్మం(30), వై నాగబాబు(20), వై సత్యనారాయణ(40), వై కృష్ణ మూర్తి(45), వై గోవింద రాజులు(35), గండి గోవింద్(18), వై నాగేశ్వరరావు(45)లు ఉన్నారు.

బాధితులను పరామార్శించిన మంత్రి కన్నబాబు
జి.వేమవరం బాణాసంచా పేలుడు బాధితులను శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరామార్శించారు. ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళి.. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరవై రోజుల వ్యవధిలో మరో బాణాసంచా పేలుడు ఘటన జిల్లాలో చోటు చేసుకొవడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న అన్ని బాణాసంచా తయారీ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనీఖీలలో ఏ ఒక్క లోపం ఉన్నా.. వెంటనే ఆ బాణాసంచా కేంద్రాన్ని సీజ్ చేయాలని అధికారులకు మంత్రి కురసాల స్పష్టం చేశారు.

చదవండి: మేడపాడులో బాణసంచా పేలుడు

మరిన్ని వార్తలు