ప్రియురాలి కోసం వేటకొడవలితో...

24 Sep, 2018 10:18 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ నాయకుడు గోనె మల్లారెడ్డి,మెడపై గాయం

గీసుకొండ(పరకాల): తన ప్రియురాలిని వెంట తిప్పుకుంటున్నాడని టీఆర్‌ఎస్‌ నాయకుడిపై ఓ వ్యక్తి కొడవలితో హత్యా యత్నం చేసిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు గోనె మల్లయ్య(మల్లారెడ్డి)ని గీసుకొండకు చెందిన ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్‌ గ్యాస్‌ సేఫ్టీ డివైజ్‌ విక్రయానికి సంబంధించి ఏజెంట్‌గా చేర్పించింది.

కాగా శని వారం మల్లారెడ్డితోపాటు టీమ్‌ లీడర్లు సదానందం, బాలిరెడ్డి, మహిళా అటెండర్‌ తమ కంపెనీ పనిపై కారులో సంగెం మండలం లోహిత గ్రామానికి బయల్దేరారు. వరంగల్‌ నగరంలోని అండర్‌బ్రిడ్జి దాటి వెళ్తుండగా గమనించిన మనుగొండ గ్రామానికి చెందిన బోయరాజు (ఊకల్‌ క్రాస్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ యజమాని) బైక్‌పై వేగంగా వెళ్లి కారుకు అడ్డంగా పెట్టాడు. మహిళా అటెండర్‌ను ఎందుకు తీసుకెళ్తున్నారని గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఆమె నిద్రిమాత్రలు మింగడంతో బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మల్లారెడ్డి తన కారులో తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె కోల్కోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద దింపి వెళ్లాడు. అక్కడికి బోయరాజు వచ్చి ఆమెతో గొడవపడి చంపుతానని బెదిరిం చాడు.

వితంతువైన ఆమె, తాను ప్రేమించుకున్నామని, చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నామని, ఫొటోలు చూపుతూ ఆమెతో తిరగరాదని హెచ్చరించాడు. గీసుకొండలో ఎంపీపీ భర్త రాజ్‌కుమార్‌ వద్ద మాట్లాడుకుందామని చెప్పి మల్లారెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం గ్రామంలోని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా హోటల్‌ వద్ద రాజ్‌కుమార్‌ ఉండగా అతడికి విషయం చెబుతుండగానే అక్కడే ఉన్న బోయ రాజు వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మల్లారెడ్డి మెడపై వేటు వేయడానికి యత్నించాడు. అయితే చొక్కా కాలర్‌కు కొడవలి తగలటంతో మెడపై స్వల్ప గాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ్‌కుమార్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై విఠల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు