వేధింపుల కేసులో ‘ఫేస్‌బుక్‌’ ఫ్రెండ్‌ అరెస్టు

25 Sep, 2018 08:22 IST|Sakshi
భాషా

సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌గా పెరిగిన సన్నిహిత్యంతో దిగిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ యువతిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. 2017లో జీలన్‌ నోయల్‌ పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాను గమనించిన బాధితురాలు మెసేజ్‌ చేసింది. అయితే తాను గాయకుడు నోయల్‌ కాదని, అనంతపురం జిల్లాకు చెందిన జీలన్‌ అని ప్రతి సమాధానం పంపిన నిందితుడు జీలన్‌ బాషా  ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌గా ఉందామని కోరాడు. ఆ తర్వాత ఇద్దరు ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ ద్వారా చాట్‌ చేసుకున్నారు. ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాల్లో బాధితురాలితో సాన్నిహిత్యం పెంచుకున్న నిందితుడు ఆమె వ్యక్తిగత ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత వారం రోజులుగా నిందితుడి ఫోన్‌కాల్స్, మెసేజ్‌లకు బాధితురాలు స్పందించలేదు. దీంతో కోపం పెంచుకున్న జీలన్‌ అభ్యంతరకర సందేశాలు, నగ్నచిత్రాలు ఆమెకు వాట్సాప్‌ చేశాడు. ఫేస్‌బుక్‌లో కూడా అభ్యంతర మెసేజ్‌లు పంపాడు.తన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోతే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బాధితురాలితో పాటు ఆమె భర్తను బెదిరించాడు. బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను  ఆశ్రయించడంతో కేసు నమోదుచేశారు. సాంకేతిక ఆధారాలతో ఇన్‌స్పెక్టర్‌ జలేందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడు జీలన్‌ బాషాను అనంతపురం జిల్లా, యెల్లనూర్‌లో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు.  అతడి నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసు విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. 

మరిన్ని వార్తలు