ఫేస్‌బుక్‌ పరిచయం.. బైక్‌ పేరుతో మోసం

22 Apr, 2019 07:37 IST|Sakshi

బంజారాహిల్స్‌:  ఫేస్‌బుక్‌లో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని ఆర్మీ అధికారి పేరిట ఓ వ్యక్తి నగర వాసిని మోసం చేశాడు. బైక్‌ విక్రయిస్తానని చెప్పి డబ్బు తీసుకొని తరువాత స్పందించకపోవడంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌–2లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న చిరుద్యోగి వెంకటేష్‌కు రవికుమార్‌ అనే పేరుతో ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. తాను ఆర్మీ అధికారినని చెప్పుకున్నాడు.

ఈ క్రమంలోనే తన వద్ద ఓ స్కూటీ ఉందని చెప్పడంతో తాను కొనుక్కుంటానని వెంకటేష్‌ వెల్లడించాడు. దీంతో రూ.15వేలు బ్యాంకు ఖాతాలో వేయమని చెప్పాడు. వాహనం రాకపోవడంతో ఆర్మీ నిబంధనల ప్రకారం.. బైక్‌ విడుదల కావాల్సి ఉంటుందని కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి ఇండియన్‌ ఆర్మీ ట్రాన్స్‌పోర్ట్‌ పార్సిల్‌ డిపార్ట్‌మెంట్‌ పేరుతో ఓ రశీదు కూడా పంపించాడు. అంతకుముందు ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, ఓటర్‌ఐడీ కార్డు కూడా పంపించడంతో సదరు యువకుడు నమ్మాడు. ఎంతకూ బైక్‌ రాకపోగా ఫోటోలో పంపించిన బైక్‌ ఆధారాలు తెలుసుకున్నాడు. అది ఓ మహిళ పేరుమీద ఉందని తేలింది. దీనికి తోడు ఆ వ్యక్తి సెల్‌కూడా స్విచ్‌ఆఫ్‌ అని వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఆర్మీ అధికారి పేరుతో ఓ వ్యక్తి అటు ఓఎల్‌ఎక్స్‌లోనూ ఇటు ఫేస్‌బుక్‌లోనూ వాహనాల ఫోటోలు పెడుతూ నకిలీ వాహనాల ఫోటోలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. 

మరిన్ని వార్తలు