ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

17 Jul, 2019 07:13 IST|Sakshi

నలుగురిపై బాధితురాలు ఫిర్యాదు

పాలషాపులో పనిచేసే ఓ వ్యక్తి, ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మరో ముగ్గురు      ఓ వివాహితపై అత్యాచారం చేశారు.     ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. ఏడాదిగా సాగిన వేధింపులతో మనస్తాపం చెందిన బాధితురాలు మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసింది.  విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... నలుగురిపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.

అనంతపురం, రాయదుర్గం రూరల్‌ : తనను భయపెట్టి.. బెదిరించి నలుగురు యువకులు అత్యాచారం చేశారని ఓ వివాహిత మంగళవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్‌ సీఐ రియాజ్‌ అహ్మద్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ వ్యక్తి నాలుగేళ్ల కిందట కర్ణాటకకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహిత ఏడాది కాలంగా రోజూ తెల్లవారుజామున సమీపంలోని షాప్‌కు వెళ్లి పాల ప్యాకెట్‌ తీసుకొచ్చేది. ఈ క్రమంలో షాపులో ఉండే మహేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇదే సమయంలో సెల్‌ఫోన్‌ ద్వారా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచిన వివాహితకు చాలామంది నుంచి ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్స్‌ వచ్చాయి. అందులో రాయదుర్గానికే చెందిన పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్‌ ఉన్నారు. వీరు ఫేస్‌బుక్‌ చాటింగ్‌ ద్వారా ఆమెను ముగ్గులోకి దింపారు. సెల్‌ నంబర్‌ కోసం ఒత్తిడి చేసి అతికష్టం మీద ఆ వివాహిత నుంచి తీసుకున్నారు.

బెదిరించి లొంగదీసుకున్నారు..
ఫేస్‌బుక్‌ ద్వారా వివాహిత వ్యక్తిగత సమాచారం, కుటుంబ విషయాలను ముగ్గురు స్నేహితులు తెలుసుకున్నారు. సేకరించుకున్న సెల్‌నంబర్‌ ద్వారా అప్పుడప్పుడు కాల్‌ చేస్తూ మరింత పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెను ‘ఫేస్‌ బుక్‌ రిలేషన్‌’ను అడ్డు పెట్టుకుని వేధించడం మొదలు పెట్టారు. తమ కోరిక తీర్చకపోతే ఇంట్లోవారికి చెబుతామని, మీ సామాజిక వర్గం వారికి తెలుపుతామని, చివరకు యాసిడ్‌ దాడికి కూడా వెనుకాడబోమని బెదిరించారు. అప్పటికీ ఒప్పుకోకపోతే భర్త, కుమారుడిని చంపేస్తామని భయపెట్టి ఆమెను లొంగదీసుకున్నారు.

వేధింపులు భరించలేక..
పాలషాపు మహేష్‌తో పాటు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్‌ల నుంచి లైంగిక వేధింపులు రోజురోజుకూ హద్దు మీరుతుండటంతో భరించలేకపోయింది. ఇంట్లో వారికి చెప్పుకోలేక.. వారి ‘కోరిక’లు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త, అత్త గమనించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది.

ఆ నలుగురిపై కేసుల నమోదు
తనను మహేష్, పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్‌లు బెదిరించి అత్యాచారం చేశారని బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పై నలుగురు యువకులపైనా 376, 370, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రియాజ్‌ అహ్మద్‌ తెలిపారు.  బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు  సమాచారం.   

ముగ్గురిపై పోక్సో, నిర్భయ కేసు 
బత్తలపల్లి : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిపైన పోక్సో యాక్ట్, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. తాడిమర్రి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బత్తలపల్లిలోని ఓ ప్రవేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థిని పట్ల సమీప బంధువులు సదానంద, కిరణ్, దివాకర్‌ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు బత్తలపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపైనా కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరిని ధర్మవరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

మరిన్ని వార్తలు