స్వామీ.. ఇదేం పని

29 May, 2019 10:50 IST|Sakshi
దొంగ స్వామి సెల్వమణి

స్వామి ముసుగులో లైంగికదాడులు

50 మందికి పైగా మహిళ జీవితాలు ఛిద్రం

దిండివనంలో దొంగస్వామి కామలీలలు

శిష్యురాలు సహా దొంగస్వామి అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజల్లోని మూఢనమ్మకాల బలహీనతే అతడికి బలం. సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళలు, యువతుల సొమ్మును దోచుకోవడం, మాయమాటలతో వలవేసి తనలోని కామవాంఛను తీర్చుకోవడం అతని నైజం. స్వామి ముసుగులో సుమారు ఏడేళ్లుగా సాగుతున్న ఈ కామప్రకోపి బండారం ఓ బాధిత యువతి ఫిర్యాదుతో బట్టబయలైంది. సహకరించిన శిష్యురాలితో దొంగస్వామి సోమవారం కటకటాల పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.   విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలో ఒంగూరులో నివసించే సెల్వమణి (35) సొంతూరు కాంచీపురం జిల్లా సూనాంపేడు గ్రామం.  మంత్రవాదిగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేయడం, మహిళలను లొంగదీసుకోవడాన్ని సహించలేని అతని భార్య, తన ఇద్దరు పిల్లలను తీసుకుని పదేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యా పిల్లలు లేకపోవడం వల్ల మరింత స్వేచ్ఛలభించడంతో సెల్వమణి తన వృత్తిని విస్తృతం చేసి భారీ ఎత్తున డబ్బు సంపాదించాడు. దీంతో అతనిలో మహిళలపై వ్యామోహం పెరిగిపోయింది. మంత్రాలు, చేతబడి, దోషపరిహార పూజల కోసం వచ్చే వివాహితలు, యువతులను శారీరకంగా లోబరుచుకునేవాడు.

సుమారు పదేళ్ల క్రితం విల్లుపురం జిల్లా దిండివనంలోని ఒంగూరుకు వచ్చి ఒక చిన్నపాటి గుడికట్టి అదే వృత్తిని కొనసాగించాడు. మీపై కొందరు చేతబడి చేశారని భయపెట్టి తాంత్రిక మంత్రాలతో నయం చేస్తానని నమ్మించి భారీ ఎత్తున డబ్బులు గుంజేవాడు. విల్లుపురం, కాంచీపురం, సేలం, నామక్కల్, ధర్మపురి, కడలూరు జిల్లాలతోపాటు పుదుచ్చేరి రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. ఇలా వచ్చిన మహిళను వశపరచుకుని, భర్త నుంచి వేరుచేసి వారితో సంసారం సాగించేవాడు. అలాగే యువతులను లొంగదీసుకున్నా డు. ఇలా లొంగిపోయిన యువతులు మరి కొందరు యువతులను సెల్వమణికి అప్పగించేవారు. ఈ కోవలో మదురైకి చెందిన హేమ (40) అనే మహిళను కూడా భర్త నుంచి వేరుచేసి ఆమెతో ఒంగూరులో కాపురం పెట్టాడు. ఆమె శిష్యురాలి లా అవతారం ఎత్తి సెల్వమణికి సహకరించేది.

కాంచీపురం యువతిపై లైంగికదాడి:
ఇదిలా ఉండగా, కాంచీపురం ఉత్తర మాలైపాక్కం అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి  దొంగస్వామిని ఇంటికి ఆహ్వానించి తన కుమారుడి సమస్యల గురించి వివరించి పరిష్కరించాలని కోరాడు. ఈ సమయంలో ఇంటి యజమాని 17 ఏళ్ల కుమార్తెపై సెల్వమణి కన్నేశాడు. కుమారునికి పట్టిన పీడ తొలగాలంటే ఊళ్లో ఆలయాని నిర్మించాల్సి ఉంటుంది, అయితే ఆసమయంలో మీ కుమార్తె ఇంటిలో ఉంటే ప్రాణాలు పోతాయని భయపెట్టాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు తన ఇంటిలో పెట్టుకుని కన్నబిడ్డలా చూసుకుంటానని నమ్మించాడు. ఇందుకు ఆమె తండ్రి తటపటాయించాడు. ఆ సమయంలో హేమ అనే యువతి వచ్చి మీ కుమార్తె నావద్ద జాగ్రత్తగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదని తండ్రికి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాడు. ఆ తరువాత యువతిని ఇద్దరూ కలిసి ఒంగూరుకు తీసుకెళ్లి తానే ఖర్చుపెట్టి చదివించాడు. మీ అన్న సమస్యలు పరిష్కారం కావాలంటే నాతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకుంటే మీ కుటుంబమంతా నాశనం అయిపోతుందని సెల్వమణి ఆ యువతిని భయపెట్టి బలవంతంగా వశపరుచుకున్నాడు. ఇందుకు శిష్యురాలు హేమ కూడా సహకరించింది. సదరు యువతికి గత నెల 8వ తేదీకి 19 ఏళ్లు రావడంతో ఈ వయస్సులోని యవతిని పెళ్లి చేసుకుంటే మానవాతీతమైన శక్తులు సిద్ధిస్తాయని భావించిన సెల్వమణి తన ఉద్దేశాన్ని యువతి తండికి చెప్పాడు. ఇందుకు తండ్రి నిరాకరించి కుమార్తెను ఇంటికి పిలుచుకువచ్చాడు. ఇన్నాళ్లూ జరిగిన ఘోరాన్ని తండ్రికి చెప్పడంతో దిండివనం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దొంగస్వామి సెల్వమణి, సహకరించిన హేమను మంగళవారం అరెస్ట్‌ చేశారు. దిండివనం కోర్టులో ప్రవేశపెట్టి కడలూరు సెంట్రల్‌ జైల్లోకి నెట్టారు.

బాధిత మహిళలు 50 మందికి పైనే..
 దొంగస్వామి సెల్వమణి పలు గ్రామాల్లో సంచరిస్తూ సుమారు 50 మందికి పైగా మహిళలు, యువతుల జీవితాలను నాశనం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. బాధితులు పరువుకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఇన్నాళ్లూ గోప్యంగా ఉండింది. అయితే పోలీసులు అరెస్ట్‌ చేయడంతో బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. పగటి వేళలో టిప్‌టాప్‌ డ్రస్సుల్లో తిరుగుతూ రాత్రివేళలో పెట్టుడు గడ్డాలు, మీసాలు పెట్టుకుని స్వామి అవతారం ఎత్తేవాడు. పదో తరగతి మాత్రమే చదివిన సెల్వమణి...స్వామి వేషంలో బాగా సంపాదింవచ్చని ఈ మార్గంలోకి వచ్చాడు. దంపతుల మధ్య తగవులు, సంతానలేమి, వివాహం కాకపోవడం సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే మహిళలు, యువతులు మైకంలోకి వెళ్లేలా చేసి తన కామవాంఛలు తీర్చుకునేవాడు.

మరిన్ని వార్తలు