నకిలీ వేలి ముద్రల తయారీ ముఠా గుట్టురట్టు

21 Nov, 2018 16:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్లోనింగ్‌ పద్ధతిలో నకిలీ వేలి ముద్రలను తయారు చేస్తున్న ముఠాను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సైదాబాద్‌లోని చంపాపేట్‌లో అక్రమంగా క్లోనింగ్‌ వేలి ముద్రలు తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తోంది. వివిధ కాలేజీల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీ వేలి ముద్రలను తయారు చేస్తూ తప్పుడు విధానంతో ఆన్‌లైన్‌ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఇప్పిస్తున్నారు. కెమికల్స్ ఉపయోగించి క్లోనింగ్ ద్వారా 29 మంది వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ఫ్యాకల్టీ వేలి ముద్రలు తయారు చేశారు.

15 మంది విద్యార్థులకు ఒక ప్రోపెసర్ ఉండాలన్న యూనివర్సిటీల నిబంధనను తప్పించుకునేందుకు క్లోనింగ్ వేలి ముద్రలు తయారు చేశారు. నిందితులను బొమ్మ రామకృష్ణ, పోరెడ్డి సుదర్శన్‌ రెడ్డి, గోపాల్ రెడ్డిలుగా పోలీసుల గుర్తించారు. బొమ్మ రామకృష్ణ  అసోషియేట్ ప్రోపెసర్‌ కాగా, పోరెడ్డి సుదర్శన్‌ రెడ్డి వివేకానంద గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బాటసింగారంలో వైఎస్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. గోపాల్ రెడ్డి కూడా వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లో సెక్రెటరీగా పని చేస్తున్నాడు. వీరు ఫీజు రిఎంబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా క్లోనింగ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా తీసుకున్నారని సిటీ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు