నకిలీ ప్లాటినం గుండ్ల విక్రయ ముఠా అరెస్ట్‌

10 Dec, 2018 11:27 IST|Sakshi
స్వాధీనం చేసుకున్నప్లాటినం గుండ్లతో పోలీసులు

అనంతపురం , హిందూపురం అర్బన్‌: ప్లాటినం గుండ్లని సీసం గుండ్లను విక్రయించాలని చూసిన ఏడుగురు సభ్యుల ముఠాను హిందూపురం వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చిన్నగోవిందు ఆదివారం మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన ముఠాలో అనంతపురానికి చెందిన పార్వతమ్మ, సేవామందిర్‌ నాగభూషణరెడ్డి, హిందూపురం ఆర్టీసీ కాలనీ ఆర్‌.కె.శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్రం తుమకూరు డి.హెచ్‌.నాగరాజు, బెంగళూరుకు చెందిన శ్రీనివాసులు, గురుమూర్తి, పావగడ ప్రకాష్‌ ఉన్నారు.

వీరు తమవద్ద ఉన్న ప్లాటినం గుండ్లు రూ.కోట్లు విలువ చేస్తాయని, మీకు కావాలంటే రూ.15లక్షలకు ఇస్తామని రామగిరికి చెందిన వీరేంద్రతో బేరం కుదుర్చుకుని, కొంత అడ్వాన్స్‌ తీసుకున్నారు. శనివారం రాత్రి గుడ్డం ఆలయం సమీపంలో పాట్లినం గుండ్లు ఇవ్వడానికి ముఠా సభ్యులందరూ చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్‌ఐ మక్బుల్‌బాషా సిబ్బందితో దాడిచేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి ప్లాటినం గుండ్లుగా చెబుతున్న 1.7 కిలోల సీసం గుండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ప్లాటినం పేరు చెప్పి భారీగా డబ్బు దండుకోవాలని చూసినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారన్నారు.

>
మరిన్ని వార్తలు